హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు అంతా ఇప్పుడు ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతోంది. ఎఫ్-క్లబ్లో పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు..ఇక్కడ ఎలాంటి పార్టీలు జరిగేవి..ఆ పార్టీల్లో డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్, జీషాన్ అలీ వంటి పెడ్లర్ల పాత్ర ఏంటి..ఎఫ్-క్లబ్ యాజమాన్యానికి చెందిన బ్యాంకు ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బులు జమ అయ్యేవి..ఇందులో సినీ ప్రముఖులు, వారి కుటుంబాలకు చెందిన వారు లావాదేవీలు జరిపారా..ఇలా ఈడీ అధికారులు కూపీలాగుతున్నారు. ఇప్పటికే ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు జారీ చేసిన సమన్ల మేరకు హీరో నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్లు సోమవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10-30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన హీరో నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్లను ఈడీ అధికారులు దాదాపు 10 గంటలపాటు విచారించారు. ముందుగా వారి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్న అధికారులు అందులో అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలిసింది. తొలుత ఎఫ్-క్లబ్ మేనేజర్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మీ క్లబ్లో పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు..అక్కడ ఎలాంటి పార్టీలు జరిగేవి..సినీ ప్రముఖుల కుటుంబాల నుంచి ఎవరైనా వచ్చేవారా?..డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్, ఈవెంట్ మేనేజర్ జీషాన్అలీలతో మీకు పరిచయం ఉందా?..అని ప్రశ్నించినట్టు తెలిసింది. అదేవిధంగా ఎఫ్-క్లబ్ కరెంటు ఖాతాల్లోకి, వ్యక్తిగత బ్యాంకుఖాతాల్లోకి, 2015 నుంచి 2017 వరకు జరిగిన లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఎఫ్-క్లబ్ మేనేజర్కు ఈడీ అధికారులు సూచించినట్టు సమాచారం.
మీరెందుకు ఆహ్వానాలు పంపేది..?
హీరో నవదీప్పైన ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. మీకు సినీ పరిశ్రమలో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి..వాళ్లలో తరచూ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యేవారు..ఫలానా చోట పార్టీలు జరుగుతున్నాయి..అంటూ వివరాలను మీరెందుకు సినీ ప్రముఖులకు వాట్సప్ పంపేవారు..? డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్, జీషాన్ అలీ, ఎఫ్-క్లబ్ మేనేజర్తో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి..ఆర్థికపరంగా ఏవైనా వారితో లావాదేవీలు జరిపేవారా?..అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. 2015 నుంచి 2017 వరకు నవదీప్ బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లను సైతం ఈడీ అధికారులు తీసుకున్నట్టు సమాచారం. గతంలో ఎక్సైజ్శాఖ జరిపిన డ్రగ్స్ కేసు విచారణలోనూ నవదీప్ను కీలకంగా ప్రశ్నించారు. అప్పట్లో నవదీప్ వాట్సప్ నంబర్ నుంచి పలువురు సినీ తారలకు పార్టీలకు రావాలంటూ ఆహ్వానిస్తూ పంపిన వందల కొద్దీ మెసేజ్లను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వాటి పైనా ఈడీ అధికారులు మరోమారు ఆరా తీసినట్టు తెలిసింది. అవసరం మేరకు మరోమారు విచారణకు రావాల్సి ఉంటుందని నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్లకు ఈడీ అధికారులు సూచించినట్టు తెలిసింది.