ముంబై, ఏప్రిల్ 13: మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రోజూ సగటున 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బుధవారం నుంచి మే 1 వరకు 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వివరాలు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నలుగురు కంటే ఎక్కువమంది గుమిగూడకుండా 144 సెక్షన్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో అత్యవసర సేవలు మాత్రమే అమల్లో ఉంటాయన్నారు. దవాఖానలు, బ్యాంకులు, మీడియా, ఈ-కామర్స్, పెట్రోల్ బంకులకు మినహాయింపునిచ్చారు. అవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దన్నారు. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని, అయితే ఇది లాక్డౌన్ మాత్రంకాదని స్పష్టతనిచ్చారు. కరోనాపై మరోసారి పోరు మొదలైందన్నారు. ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో వచ్చే నెలలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి మూడు కిలోల గోధుమలు, రెండు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయనున్నట్టు తెలిపారు. కేసుల పెరుగుదల దృష్ట్యా రాష్ట్రంలోని కొవిడ్ దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్,రెమ్డెసివిర్ ఔషధానికి కొరత ఏర్పడిందని అన్నారు. వాయుసేనకు చెందిన విమానాల ద్వారా వీటిని వెంటనే రాష్ర్టానికి పంపాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. రద్దు కుదరకపోతే పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలన్నారు.