ప్రముఖ సినీ డబ్బింగ్ కళాకారుడు ఘంటసాల రత్నకుమార్ గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. దివంగత సుప్రసిద్ధ గాయకుడు, సంగీతదర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడాయన. కరోనా బారిన పడిన రత్నకుమార్ కొన్నాళ్లుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాసవిడిచారు. ఘంటసాల వెంకటేశ్వరావు ఆరుగురు సంతానంలో రత్నకుమార్ రెండోవారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన గాయకుడు కావాలనే లక్ష్యంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం డబ్బింగ్పై దృష్టిపెట్టారు. తెలుగు, తమిళం,మలయాళం, సంస్కృతం,హిందీ భాషల్లో పన్నెండువందలకుపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. అర్జున్, కార్తిక్, వినోద్కుమార్, అరవింద్స్వామితో పాటు పలువురు హీరోలకు గాత్రదానం చేశారు. ఏకధాటిగా ఎనిమిది గంటలు డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. ఆహుతి, అంకుశం, అత్తగారు జిందాబాద్తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించారు. ఆట ఆరంభం, వీరుడొక్కడేతో పాటు ముప్పైకిపైగా చిత్రాలకు సంభాషణల రచయితగా పనిచేశారు.