ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్గా దూసుకుపోతున్న మహేష్ కెరీర్లోని బెస్ట్ చిత్రాలలో దూకుడు ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, సోనూ సూద్ తో పాటు బ్రహ్మానందంప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 23 సెప్టెంబర్ 2011 న 1800 స్క్రీన్లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది.
35 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 57.4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్, 101 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మహేష్ కెరీర్ లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘పోకిరి’ తరువాత మహేశ్ నటించిన సైనికుడు,అతిథి, ఖలేజా చిత్రాలు నిరాశపరిచాయి. ఆ సమయంలో ‘దూకుడు’ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకు పోయింది.ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది.
తెలుగు చలన చిత్రపరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న “దూకుడు” చిత్రం విడుదలై నేటితో పదేళ్లు అయింది. సందర్భంగా మరోసారి ఆంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో “దూకుడు” రిలీజ్ చేశారు మహేష్ ఫ్యాన్స్. మళ్లీ ఆ సందడిని వెండితెరపై చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ తో కలసి శ్రీను వైట్ల రచన చేశారు. ఇందులోని కామెడీ సీన్స్ జనాన్ని భలేగా కట్టి పడేశాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు.