న్యూఢిల్లీ : కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 17 కోట్లకుపైగా మోతాదులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా డోసులు వేసినట్లు పేర్కొంది. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు 95,46,871 మందికి మొదటి డోసు, మరో 64,71,090 మందికి రెండో మోతాదు అందించినట్లు చెప్పింది. 1,39,71,341 ఫ్రంట్లైన్ వర్కర్కు మొదటి డోసు, 77,54,283 రెండో మోతాదు వేసినట్లు తెలిపింది.
18-44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి 20,29,395 ఫస్ట్ డోస్ వేసినట్లు పేర్కొంది. 45-60 ఏళ్ల మధ్య ఉన్న 5,51,74,561 మంది లబ్ధిదారులకు తొలి, మరో 65,55,714 మందికి సెకండ్ డోస్ అందజేసినట్లు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన 5,36,72,259 మందికి తొలి మోతాదు, 1,49,77,918 రెండో మోతాదు టీకా వేసినట్లు వివరించింది. 18-44 మధ్య వయస్కులకు ఆదివారం ఒకే రోజు 2,43,958 మంది లబ్ధిదారులు టీకాలు వేయగా.. ఇప్పటి వరకు 20,29,395 మంది తొలి మోతాదు అందింది.
టీకా డ్రైవ్ ఆదివారం 114వ రోజుకు చేరగా.. ఒకే రోజు 6,71,646 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆదివారం సెలవు దినం కావడంతో చాలా రాష్ట్రాలు టీకాలు వేయలేదని చెప్పింది. ఇదిలా ఉండగా.. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాదాపు 18 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో 9 లక్షల డోసులు అందజేస్తామని చెప్పింది.