న్యూయార్క్, ఏప్రిల్ 29: జ్వరం వస్తే పారాసిటమాల్ మాత్రను వేసుకొని నీళ్లు తాగి కాసేపు పడుకుంటాం. రెండు మూడు గంటల్లో జ్వరం తగ్గి సత్తువ వస్తుంది. కరోనా సోకినప్పుడు కూడా అలాంటి ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే.. మహమ్మారి తోకముడిచి పారిపోతే ఎలా ఉంటుంది? ఏంటి నమ్మడం లేదా?? ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్-19 ఆటకట్టించే ట్యాబ్లెట్ రెడీ అవుతున్నది. కరోనాకు సమర్థమంతమైన వ్యాక్సిన్ను తీసుకొచ్చిన ‘ఫైజర్’ సంస్థ ఈ ఔషధాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది. ఇప్పటికే, దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అమెరికా, బెల్జియంలోని ఫైజర్ పరిశోధన కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, వచ్చే ఏడాదే ఈ మాత్రలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం అందరి ఇండ్లల్లో అందుబాటులో ఉండే పారాసిటమాల్ మాత్రలను సరఫరా చేసినట్టే, ఈ ‘కరోనా’ ట్యాబ్లెట్లను కూడా పెద్దఎత్తున అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫైజర్ ప్రతినిధులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న రోగులు ఈ మాత్రలను వేసుకోవచ్చని, కరోనా కట్టడికి ప్రపంచంలో తయారైన మొదటి మాత్ర తమదేనని వెల్లడించారు.
210 మంది నిపుణుల కష్టమిది!
ఈ ‘కరోనా ట్యాబ్లెట్’ తయారీకి 210 మంది శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడ్డారు. పరిశోధనల అనంతరం గత అక్టోబర్లో 7 మిల్లీగ్రాముల (వాన నీటి చుక్క కంటే తక్కువ పరిమాణం) పదార్థాన్ని (ట్యాబ్లెట్ చూర్ణం) అభివృద్ధి చేశారు. గత వారమే.. దాదాపు కిలో మోతాదులో చూర్ణాన్ని తయారు చేశారు. దీన్ని మూడు దశల్లో వివిధ వయసులో ఉన్న వలంటీర్లకు (కరోనా రోగులు) ఇవ్వనున్నారు. 145 రోజులు సాగే ఈ పరిశోధనల్లో ఔషధం పనితీరును బేరీజు వేస్తారు.
ఫైజర్, మోడెర్నాతో దవాఖాన రిస్క్ ఉండదు!
దవాఖానల్లో చేరే అవకాశాలను ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 94 శాతం వరకు తగ్గిస్తాయని అమెరికాలోని ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ ఒక అధ్యయనంలో పేర్కొంది. రెండు డోసులను తీసుకున్న 65 ఏండ్లు పైబడిన వారిలో ఈ విషయాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ టీకా ఒక డోసు తీసుకున్న వారు దవాఖానలో చేరే అవకాశాలు 64 శాతం వరకు తగ్గుతాయని వివరించింది.