సబ్బండ వర్గాలకు కేసీఆర్ సర్కారు ప్రాధాన్యం
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
సాగర్ నియోజకవర్గానికి జానా చేసింది శూన్యం
కాంగ్రెస్ పాలనలో కొందరికే పథకాలు
నేడు అర్హులందరికీ నేరుగా ఫలాలు
ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని
అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నాయకులు
విద్యుత్ శాఖ మ్ంరత్రి గుంటకండ్ల
పెద్దవూర, ఏప్రిల్ 6 : “సంక్షేమ పథకాల అమలులో యావత్ దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఏడేండ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తాయి” అని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేను చేసినా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు జానారెడ్డి చేసిందేమీ లేదని, కొత్తగా చెయ్యబోయేదీ ఉండదని విమర్శించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి మంగళవారం పెద్దవూర మండలంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మధ్యవర్తుల ప్రమేయంతో కొందరికే ప్రభుత్వ పథకాలు అందేవని, నేడు టీఆర్ఎస్ పాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వృత్తిదారులకు గౌరవమిచ్చి వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చారన్నారు.
దేశంలో, రాష్ట్రంలో అధికారంలోలేని కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందని, నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం పెద్దవూర మండలంలోని తెప్పలమడుగు, లింగంపల్లి , శిర్సనగండ్ల, తమ్మడపల్లి , కొత్తలూరు, బసిరెడ్డిపల్లి, వెల్మగూడెం, కటికర్లగూడెం, గర్నెకుంట, పిన్నవూర, సంగారం గ్రామాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం, సంగారం, పోతునూరు గ్రామాల్లో ధూంధాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి సామంతులను పెట్టి పాలన సాగించే రోజులకు 2018 ఎన్నికల్లోనే ప్రజలు చరమగీతం పాడారని, అప్పుడు నోముల నర్సింహయ్యను గెలిపించినట్లుగానే ఆయన తనయుడు భగత్కు పట్టం కట్టాలని కోరారు.
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ పథకాలతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనివాస్ కుంటుబాన్ని పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమైందని, ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, పర్యాటక శాఖ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కంచర్ల చంద్రశేఖర్రెడ్డి, గోనె విష్టువర్ధన్రావు, గడ్డంపల్లి రవీందర్రెడ్డి, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, కర్ణ బ్రహ్మానందరెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధా సుందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గోనె వివేక్రావు, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, మాజీ ఎంపీపీ అంతయ్యయాదవ్ పాల్గొన్నారు.
అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నాయకులు : మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని, దీంతో వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014లో జానారెడ్డి గెలవడమే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి శాపంగా మారిందన్నారు. జానారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడైనా ముఖ్యమంత్రి కేసీఆర్నుగానీ, ఇతర మంత్రులను కలిసి అభివృద్ధిపై మాట్లాడలేదని, పైగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు అడ్డుపడ్డారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య గెలిచిన తర్వాతనే ఇక్కడ అభివృద్ధి ప్రారంభమైందని, నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే నోముల భగత్ను గెలిపించాలని కోరారు. అంతకుముందు ఇటీవల మరణించిన సర్పంచ్ కర్నాటి విజయభాస్కర్రెడ్డికి నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి
ధోనీ హెలికాప్టర్ షాట్ చాక్లెట్లు వచ్చేశాయ్!
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్తో బోలెడు బెనిఫిట్లు!