జిల్లాలో 14,143 మందికి రూ.14 కోట్లు మంజూరు
సర్వేలో గుర్తించిన వారికి ఐడీ కార్డులు, ధ్రువపత్రాల జారీ
20 వేల వ్యాపారులను అర్హులుగా గుర్తించిన మెప్మా సిబ్బంది
65.83 శాతం లక్ష్యాన్ని చేరుకున్న బ్యాంకులు
సకాలంలో బ్యాంకు వాయిదాలు చెల్లిస్తే 7 శాతం వడ్డీ మాఫీ
డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి క్యాష్ బ్యాక్
మిగతా వారికి అవగాహన కల్పిస్తున్న అధికారులు
సంగారెడ్డి, మార్చి 17 : మున్సిపాలిటీలోని వీధుల్లో చిరు వ్యాపారం చేసుకొని జీవనం సాగించే వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నది. రోడ్ల ప్రక్కన చిరు వ్యాపారాలు చేసుకొని బతుకు బండి సాగిస్తున్న వ్యాపారుల అభివృద్ధికి తెలంగాణ సర్కారు పాటుపడుతున్నది. జిల్లాలోని 8 మున్సిపాలిల్లో వీధి వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తించి వ్యాపార అభివృద్ధికి రుణాలు ఇచ్చి ఆదుకోవడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లాలో 14,143 మందికి రూ.10 వేల చొప్పున రుణాలు మంజూరు చేసింది. అధికారులు గుర్తించిన వ్యాపారుల కోసం ప్రభు త్వం రూ.14.14 కోట్లు కేటాయించింది. వీధి వ్యాపారులకు రుణాలు అందజేసేందుకు మెప్మా అధికారులు అర్హులను గుర్తించి ఐడీ కార్డులు, ధ్రువపత్రాలు అందజేశారు. పట్టణాల్లో మెప్మా సిబ్బంది వీధుల్లో వ్యాపారం చేస్తున్న 20 వేల మందిని మెప్మా సిబ్బంది గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించిన విషయం తెలిసిందే. వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంతో వడ్డీ మాఫీ పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
రుణ లక్ష్యాన్ని చేరుకుంటాం…
జిల్లాలో బ్యాంకులు 65.83 శాతం రుణ లక్ష్యాన్ని చేరుకుని అర్హులైన వీధి వ్యాపారులకు రుణాలు అందిచేసినట్లు మెప్మా అధికారులు స్పష్టం చేశారు. రుణాలను తిరిగి సకాలంలో క్రమం తప్పకుండా చెల్లిస్తే 7 శాతం వడ్డీ మాఫీ పొందనున్నారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్ చేసిన వారికి క్యాష్బ్యాక్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైనవారు బ్యాంకు రుణాలు తీసుకునేలా మెప్మా సిబ్బంది ప్రాజెక్టు అధికారి ఆదేశాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రతి శనివారం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వీధి వ్యాపారులు లబ్ధిపొందేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే కొందరు రుణా లు తీసుకొని వీధి వ్యాపారం చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
14,143 వేల మందికి రుణాల మంజూరు..
జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో 18,418 మంది వీధి వ్యాపారులు ఉండగా.. మెప్మా అధికారులు, సిబ్బంది సర్వేలో 20,008 మందిని సర్వేలో గుర్తించి రుణాలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఇందులో 17,509 మంది వీధి వ్యాపారులు కూరగాయలు, పండ్లు, టైలరింగ్, చెప్పుల వ్యాపారం, గాజుల దుకాణం, తోపుడు బండ్లపై ఇంటి వస్తువులు, సోడా, నిమ్మకాయ రసం అమ్మె వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. వ్యాపారుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి 14,143 మంది వ్యాపారులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులకు నివేదికలు అందజేశారు. బ్యాంకర్లు మెప్మా అధికారుల నివేదికల ఆధారంగా పూర్తి వివరాలు నమోదు చేసుకొని 11,527 మంది వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు. మెప్మా సిబ్బంది, అధికారులు గుర్తించిన లబ్ధిదారులు 80.78 శాతం కాగా బ్యాంకు రుణాలు పొందినవారు 65.83 శాతం మంది ఉన్నారు. మిగతా లబ్ధిదారులు కూడా రుణాలు తీసుకునేందుకు అధికారులు ప్రతి శనివారం మున్సిపాలిటీల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆన్లైన్లో నమోదైన వారికి ఐడీకార్డులు, ధ్రువపత్రాలు…
ప్రభుత్వం వీధి వ్యాపారులకు రుణాలు అందించి స్వయం ఉపాధికి ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని మున్సిపాలిటీల్లో దరఖాస్తులు చేసుకున్న వారికి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి ఐడీకార్డులు, ధ్రువపత్రాలు అందజేశారు. పట్టణాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వం రుణాలు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 17,509 మంది దరఖాస్తులు ఆన్లైన్లో పొందుపర్చగా.. ఇందులో 14,143 మంది వ్యాపారులకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.