గందరగోళంగా హెచ్సీఏ ఏజీఎమ్.. అంబుడ్స్మన్పై కొలిక్కిరాని స్పష్టత
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) పరిపాలనలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పావులు కదుపుతూనే ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు అసోసియేషన్లో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హెచ్సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లోనూ ఇదే తంతు కొనసాగింది. అధ్యక్షుడు అజర్ ఓ వర్గం.. కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ ప్రత్యర్థి వర్గంగా మారడంతో ఏజీఎమ్ రసాభాసగా మారింది. ముఖ్యంగా అంబుడ్స్మన్ నియామకం విషయంలో ఎలాంటి స్పష్టత లేకుండానే అసంపూర్తిగా ముగిసింది. జస్టిస్ దీపక్వర్మను నియమిస్తున్నట్లు హెచ్సీఏ చీఫ్ అజర్ ప్రకటిస్తే..ప్రత్యర్థి వర్గం జస్టిస్ నిసార్అహ్మద్ కక్రు, జస్టిస్ మీనా కుమారి నియమించాలంటూ పట్టుబట్టాయి. ఈ క్రమంలో అజర్.. ఏజీఎమ్ను అర్ధాంతరంగా ముగించి విలేకర్ల సమావేశంలో మాట్లాడాడు. దీనికి కౌంటర్గా జాన్ మనోజ్, విజయానంద్ వర్గం అజర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎజెండాలోని అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హెచ్సీఏ వైఖరిపై బీసీసీఐ ఆగ్రహంగా ఉందన్న అజర్.. హైకోర్టు తీర్పును అనుసరించి అంబుడ్స్మన్గా జస్టిస్ దీపక్వర్మను నియమిస్తున్నట్లు ప్రకటించాడు. హెచ్సీఏ ప్రతినిధిగా ఈ విషయాన్ని బీసీసీఐ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశాడు. క్రికెట్ సలహాదారుల కమిటీలోకి వెంకటపతిరాజు, పూర్ణిమా రావు, సుదీప్త్యాగిని అజర్ ప్రతిపాదించగా.. ఎమ్వీ నరసింహరావు, స్రవం తి నాయుడు, త్యాగి పేర్లను విజయానంద్ వర్గం సూచించింది. మొత్తంగా కమిటీల ఎంపిక విషయంలోనూ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదిలా ఉంటే ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ అధ్యక్షతన జరిగిన భేటీలో 11 కమిటీలతో పాటు సీఈవో, సీఎఫ్వో, మేనేజర్లను ఎంపిక చేశారు.
టీపీఎల్ కోసం కమిటీ
తెలంగాణలో ప్రతిభ కల్గిన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2019లో హెచ్సీఏ..టీస్పోర్ట్స్తో ఒప్పం దం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) ఏర్పాటు కోసం హెచ్సీఏ తాజాగా నరేందర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి సభ్యులుగా టీపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. లీగ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను బీసీసీఐ ఆమోదానికి పంపింది. బోర్డు నుంచి గ్రీన్సిగ్నల్ లభించిన వెంటనే టీపీఎల్ త్వరలో మొదలవుతుందని హెచ్సీఏ వర్గాలు పేర్కొన్నాయి.