శ్రీనగర్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. దీంతో ఆక్సిజన్, ఔషధాలకు కొరత ఏర్పడింది. మరోవైపు కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చాలా రాష్ట్రాలు పూర్తిగాను, పాక్షికంగాను లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడే పేదలకు సహాయం చేసేందుకు ఎన్జీవో సంస్థలు ముందుకు వస్తున్నాయి.
కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో కూడా లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ అక్కడి పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అవసరమైన నిత్యవసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తున్నది.
కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకు తమ వంతు సహాయం చేస్తున్నట్లు ఎన్జీవో సంస్థ అధిపతి రాయన్ ఫరూక్ తెలిపారు. స్నేహితులు, బంధువులు, ఇతరుల నుంచి విరాళాలు సేకరించి సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రేషన్ కిట్లను పేదలకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.