సొంత జీవితంపై స్పృహలేకుండా ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లోకి తొంగిచూడటం అదిపెద్ద రుగ్మత అని అభిప్రాయపడింది అగ్ర కథానాయిక శృతిహాసన్. ఉహాలోకంలో విహరించకుండా ఎవరి జీవితాన్ని వారు చక్కబెట్టుకోవాలని సున్నితంగా మందలించింది. ఇటీవల సోషల్మీడియాలో అభిమానులతో ముచ్చటించిందీ అమ్మడు. ఈ సందర్భంగా ఓ అభిమాని పెళ్లి గురించి అడిగారు. తాజా ప్రేమాయణాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లే ఉద్దేశ్యం ఉందా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించగా..సదరు అభిమానికి అంతే ఘాటుగా సమాధానమిచ్చింది శృతిహాసన్. పెళ్లి పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని, దాని గురించి ఊహాగానాలు చేసుకుంటూ మనసు పాడు చేసుకోవద్దని హితవు పలికింది. ఇతరుల పర్సనల్ లైఫ్లోకి తొంగిచూసే ప్రయత్నం చేయడం మంచి లక్షణం కాదని సున్నితంగా హెచ్చరించింది. ఈ మధ్యకాలంలో స్వీయ జీవితాన్వేషణపై తాను దృష్టిపెడుతున్నానని, ప్రశాంత చిత్తాల్ని అలవర్చుకొని జీవితాన్ని సాగిస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు సెల్ఫ్డిస్కవరీ థెరపీని పాటించితే తమ బలాలు, బలహీనతలపై పరిపూర్ణమైన అవగాహన వస్తుందని.. ఎలాంటి సంఘర్షణ లేని జీవితాన్ని ఆస్వాదించవొచ్చని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.