ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ
మౌలిక వసతులు, రాయితీలతో ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే రెండు ప్రతిష్టాత్మక కంపెనీల కార్యకలాపాలు
స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు
ప్రత్యేకంగా ఐటీ పార్కు ఏర్పాటుతో యువతలో కొత్త ఆశలు
కరోనా తొలగితే రానున్న మరిన్ని సంస్థలు
వరంగల్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఒకప్పుడు హైదరాబాద్కే పరిమితమైన ఐటీరంగం ఇప్పుడు వరంగల్ సిటీకి విస్తరిస్తోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పట్టుదల, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ.. మౌలిక వసతులు, రాయితీలు, పన్నుల్లో మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కల్పిస్తూ ప్రతిష్టాత్మక కంపెనీలు మహానగరంలో కార్యకలాపాలు సాగించేలా చేసింది. ఇందులో భాగంగా గతేడాది ప్రభుత్వ ఇంక్యుబేషన్ సెంటర్లో సైయంట్ కంపెనీ, ఆ తర్వాత టెక్ మహీంద్రా లాంటి సంస్థలు పనుల్ని ప్రారంభించడంతో స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశం దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద సిటీలతో పోల్చితే కంపెనీల నిర్వహణ ఖర్చు ఇక్కడ 25శాతం తగ్గుతుండడంతో దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కొవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత మరికొన్ని సంస్థలు రానున్నాయి.
వరంగల్ నగరం ఐటీ రంగంలోనూ అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్గా నిలిచిన హైదరాబాద్కు అనుబంధంగా వరంగల్ మహానగరాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమకూర్చుతోంది. హైదరాబాద్కు సమీపంలో ఉండడం.. రైలు, జాతీయ రహదారి వంటి మెరుగైన రవాణా సౌకర్యాలు వంటి అనుకూల అంశాలు ఉన్నందు వల్ల వరంగల్-హైదరాబాద్ దారిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఐటీ హబ్ ఏర్పాటుచేసింది. బెంగళూరు తర్వాత మైసూరు అభివృద్ధి చెందినట్లుగానే.. హైదరాబాద్కు వరంగల్ను ఐటీ పరంగా అభివృద్ధి చేసేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు.
ఇందులో భాగంగా 2020 ఫిబ్రవరి 6న మంత్రి కేటీఆర్ వరంగల్లో సైయంట్ కంపెనీ ఇంక్యుబేషన్ సెంటర్ను, టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ప్రభుత్వం నిర్మించిన ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లో అప్పటివరకు ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించింది. సైయంట్ సొంత భవానాల్లోకి మారడంతో ప్రభుత్వ ఇంక్యుబేషన్ సెంటర్లో టెక్ మహీంద్రా తమ కార్యకలాపాలను మొదలుపెట్టింది. టెక్ మహీంద్రా కూడా త్వరలోనే సొంత భవనాలను సమకూర్చుకోనుంది. సైయంట్ కంపెనీ 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన క్యాంపస్లో రెండు వేల మంది పని చేసే అవకాశం ఉంటుంది. టెక్ మహీంద్రా సైతం కొత్త భవనాన్ని పూర్తిచేస్తే ఇదే స్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రతిష్టాత్మక సంస్థలు వరుస కడుతుండడంతో వరంగల్లో ఐటీ విస్తరణ వేగం పుంజుకుంటోంది. కరోనా నేపథ్యంలో ‘వర్క్ ఫ్రం హోమ్’తో ఇబ్బందులుండగా వైరస్ తీవ్రత తొలగిపోతే ఐటీ రంగంలో వరంగల్కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు..
వరంగల్లో ఐటీ రంగం విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోంది. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇక్కడికి వచ్చే కంపెనీలకు రాయితీలు ఇస్తోంది. హైదరాబాద్తో పోలిస్తే వరంగల్ వంటి నగరాల్లో ఐటీ కంపెనీలు కార్యకలాపాలను విస్తరించడం వల్ల నిర్వహణ ఖర్చు 25శాతం వరకు తగ్గుతుంది. వరంగల్ మహానగరానికి మొదట వచ్చే ఐటీ కంపెనీలకు మూడేండ్ల పాటు మున్సిపల్ పన్నుల నుంచి మినహాయింపు ఇస్తున్నారు. ఐటీ ఈవెంట్ల నిర్వహణ ఖర్చుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి యూనిట్కు రూపాయి చొప్పున కరంటు బిల్లులను తిరిగి ఇస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)తో కలిసి ఐటీ కంపెనీలకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తే టాస్క్ నుంచి ప్రతి విద్యార్థికి రూ.20 వేలకు సహకారం అందిస్తోంది. 250కి పైగా ఐటీ ఉద్యోగులు, 500కు పైగా ఐటీ ఆధారిత ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు రూ.10 లక్షల వరకు సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోంది. ప్రభుత్వం ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో వరంగల్లో వృత్తి విద్యా కాలేజీలు ఎక్కువగా ఉండడంతో ఐటీ రంగం మన నగరానికి విస్తరిస్తోంది.