సూపర్స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి ఎలాంటి వార్త వినిపించిన కూడా వాళ్ళు పండగ చేసుకుంటారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమాపై తాజాగా మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మొన్నటి వరకు ఇది జేమ్స్ బాండ్ తరహా సినిమా అని.. ఈ నేపథ్యంలోనే విజయేంద్రప్రసాద్ కథ కూడా సిద్ధం చేశాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే త్రివిక్రమ్ సినిమాలో కూడా మహేష్ బాబు ఏజెంట్ తరహా పాత్రలోనే నటించబోతున్నాడనే వార్తలు రావడంతో రాజమౌళి మరో కథను ఎంచుకున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి.
ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో మహేష్ చత్రపతి శివాజీ పాత్రలో నటించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం మహేష్ బాబు అభిమానులను గాల్లో తేలిపోయేలా చేస్తోంది. ఈ సినిమాలో శివాజీ పాత్రలో మహేష్ నటిస్తున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్నది. అదేంటంటే ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే రాజమౌళి యూనిట్ సభ్యులు లోకేషన్స్ వేట కూడా మొదలుపెట్టారు. ఒక్కసారి ట్రిపుల్ ఆర్ అయిపోతే తన పూర్తి ఫోకస్ మొత్తం మహేష్ బాబు సినిమాపై పెట్టనున్నాడు రాజమౌళి.
సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నాడు. ఇది ఎలాంటి జోనర్ అయినా కానీ.. ఎలాంటి సినిమా అయినా కానీ.. ఎన్నో ఏళ్లుగా అటు రాజమౌళి.. ఇటు మహేష్ బాబు అభిమానులు వేచి చూస్తున్న సినిమా. అందుకే దీని గురించి ఏ వార్త వచ్చినా కూడా అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం పరశురామ్ సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఇవి అయిపోయిన తర్వాత రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.