రామ్ కథానాయకుడిగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. లింగుస్వామి దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. బుధవారం ఈ చిత్రసెట్స్ను అగ్ర దర్శకుడు శంకర్ సందర్శించారు. శంకర్ రాకతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన చిత్రబృందం ఆయనకు స్వాగతం పలికింది. నిర్మాత మాట్లాడుతూ ‘నాయకానాయికలు రామ్, కృతిశెట్టితో పాటు నదియాలపై కీలక సన్నివేశాలను దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా సెట్స్లో అడుగుపెట్టిన శంకర్ను చూసి టీమ్ అందరం సర్ప్రైజ్ అయ్యాం. ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన పాటను విన్న శంకర్ బాగుందని ప్రశంసించడం ఆనందాన్ని కలిగించింది’ అని తెలిపారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.