వరంగల్ అర్బన్ : వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 50 పడకలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ప్రారంభించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేకంగా 800 బెడ్స్ను కరోనా చికిత్సకు కేటాయించినట్లు తెలిపారు. అందులో ఐసీయూతో సహా ఆక్సిజన్తో కూడిన 650 బెడ్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎంజీఎంలో 506 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా ఇంకా 294 బెడ్లు ఖాళీగానే ఉన్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ హాయాంలోనే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది సమస్యలపై జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంజీఎం ఆసుపత్రిలో రోగులను ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కేఎంసీ 1986 బ్యాచ్కు చెందిన డాక్టర్లు, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్రావు రూ. 20 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మాస్కులు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. ఈ కష్టకాలంలో సేవా భావంతో ముందుకు వచ్చి సహాకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దాతలను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరెందర్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, ఎంజీఎం ఆసుపత్రి సూపరిండెంట్ వి.చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, పలువురు వైద్యులు పాల్గొన్నారు.