2.18 లక్షల ఎకరాల్లో సాగు
4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
జిల్లాలో మొదలైన వరికోతలు
వారంలోగా ప్రారంభం కానున్న కొనుగోలు కేంద్రాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): యాసంగిలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి సాగైంది. కుమ్రం భీం, వట్టి వాగు ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడం, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడం పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు భూగర్భ జలాలు పెరగడంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2.18 లక్షల ఎకరాలు ఈ యాసంగిలో వరి సాగైంది. దీంతో సుమారు 4.57 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకుపోనూ మిగిలిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వచ్చే దిగుబడిని అంచనా వేస్తూ కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఈ యాసంగిలో 448 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరో వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆది నుంచి రైతుల పక్షపాతిగానే నిలుస్తున్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్నప్పటికీ అన్నదాతలకు అండగా నిలిచేందుకు యాసంగిలో మద్దతు ధరకు ధాన్యం కొనాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో అన్నదాతల సహకారం పూర్తిగా అవసరమని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చేటప్పుడు కనీస ప్రమాణాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తేమ 17 శాతం లోపు ఉండాలని, అదేవిధంగా చెత్త 1 శాతం, మట్టి పెల్లలు 1 శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, తక్కువ రకాల మిశ్రమం 6 శాతం చొప్పున ఉన్న ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 1888 చెల్లిస్తారు. సాధారణ రకానికి రూ. 1866 చెల్లిస్తారు. నిర్ణీత నిబంధనలను ఇప్పటికే వ్యవసాయ అధికారులు, గ్రామాల్లో రైతులకు వివరిస్తున్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర లభిస్తే ఉమ్మడి జిల్లాలో రూ.862.88 కోట్ల ఆదాయం రానున్నదని అంచనా వేస్తున్నారు.
ప్రారంభమైన వరికోతలు
జిల్లాలో యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. రైతులు నేరుగా పొలాల్లో హార్వెస్టర్ల ద్వారా కోతలు చేపడుతున్నారు. హార్వెస్టింగ్ చేసిన వడ్లలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు పొలాల్లోనే వరిని ఆరబెడుతున్నా రు. ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయనుండడంతో రైతులు ధాన్యం అమ్మకాల గురించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటేటా యాసంగిలో వరిసాగు పెరుగుతూ వస్తోంది. మంచిర్యాలలో ఈ యాసంగిలో వరి పుష్కలంగా సాగయ్యింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. ఈ యాసంగిలో వరిసాగు లక్షా 10 వేల ఎకరాలకు పెరిగిం ది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచిర్యాల జిల్లాలో 250 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 90 వేల ఎకరాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 15 వేల 600 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 2500 ఎకరాల్లో వరి సాగు చేశారు.
ఇవి కూడా చదవండి
యూకే వేరియంట్ వల్లే ఢిల్లీలో భారీగా కరోనా కేసులు
సీపీఐ(ఎం)కు చెందిన 16 సంస్థలపై ఏడాది నిషేధం