‘చెన్నైలో నాకు ఎదురైన వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కథ రాసుకున్నా. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది’ అని అన్నారు దర్శన్. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. సుశాంత్, మీనాక్షిచౌదరి జంటగా నటించారు. రవిశంకర్శాస్త్రి, ఏక్తాశాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మించారు. ఆదివారం హైదరాబాద్లో దర్శన్ పాత్రికేయులతో ముచ్చటించారు.
ఆ సంగతులివి..
‘ఒక రాత్రిలో ఓ యువకుడి జీవితంలో ఎలాంటి సంఘటనల చోటుచేసుకున్నాయి? నో పార్కింగ్లో బండి పెట్టడం వల్ల అతడికి ఏ విధమైన అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నది ఉత్కంఠను పంచుతుంది. ‘చిలసౌ’కు ముందు సుశాంత్కు ఈ కథ వినిపించా. ఆయనకు చాలా నచ్చింది. ఇందులో సుశాంత్ ఆర్కిటెక్ట్గా కనిపిస్తారు. స్నేహానికి విలువనిచ్చే మధ్య తరగతి యువకుడిగా ఆయన పాత్ర వినూత్నపంథాలో సాగుతుంది. నటుడిగా ఆయన్ని కొత్త కోణంలో ఈ సినిమా ఆవిష్కరిస్తుంది.
నాన్న స్ఫూర్తితో
సినిమా స్క్రీన్ప్లే నవ్యరీతిలో ఉంటుంది. నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. తొలుత ఈ సినిమాను తమిళంలో చేయాలనుకున్నా. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. హాస్యనటుడు ప్రియదర్శి నాకు మంచి స్నేహితుడు. ఆయన ద్వారా తెలుగులో ఈ సినిమా రూపొందించే అవకాశం వచ్చింది. నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ దివంగత నటి భానుమతిగారి మనవడు. ఈ సినిమాతో ఆయన సినీపరిశ్రమలోకి పునరాగమనం చేస్తున్నారు. ఆయనతో పాటు ఏక్తా శాస్త్రి, హరీష్ చక్కటి సహకారం అందించారు. మా నాన్న కేశన్ తమిళంలో దర్శకుడు, రచయితగా పనిచేశారు. ఆయన ద్వారా నాకు దర్శకత్వ విభాగంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు శ్రీనివాస్రెడ్డి వద్ద ‘ఢమరుకం’, ‘రాగల 24 గంటల్లో’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను.