ఎంజీఎం దవాఖానలో పకడ్బందీగా కరోనా వైద్య సేవలు
పర్యవేక్షణకు ఇద్దరు ప్రత్యేకాధికారులు
ఉమ్మడి జిల్లా దవాఖానల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ
పాలకుర్తిలో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం
వరంగల్ చౌరస్తా, మే 6 : ఉత్తర తెలంగాణ వాసులకే కాకుండా ఇతర రాష్ర్టాల ప్రజలకు సైతం కరోనా వైద్యసేవలు అందిస్తున్న వరంగల్ ఎంజీఎం దవాఖానపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎంజీఎం దవాఖానలో కరోనా వైద్య సేవలు అందించడానికి 800 పడకలు ఏర్పాటు చేసి, 650 పడకలకు ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. గురువారం ఆయన ఎంజీఎం హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్యసేవలు, ఆక్సిజన్, ఔషధాల నిల్వల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులు, వైద్యులు సహకరించాలని ఆయన కోరారు. ఆపదకాలంలో బాధితుల ప్రాణాలను నిలిపేందుకు వినియోగించే రెమ్డెసివర్ ఇంజక్షన్లు కొరత లేకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
ఎంజీఎంలో వైద్యులు, పారా మెడికల్, శానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బంది నిస్వార్థంగా విధులు నిర్వర్తిస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రజలు అలాంటి అవాస్తవాలను నమ్మవద్దని సూచించారు. ప్రైవేట్ దవాఖానల నుంచి చివరి నిమిషంలో ఎంజీఎంలో చేరి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. చివరి క్షణాల్లో చేరడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారే తప్ప, ముందు జాగ్రత్తగా ఎంజీఎంలో చేరిన వారు కోలుకుని ఇంటికి వెళుతున్నారన్నారు. ప్రైవేట్ దవాఖానలు ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి వ్యవహరిస్తున్నాయనే విషయం తన దృష్టికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడంతో పాటు చివరి నిమిషాల్లో చేతులు ఎత్తేయడం వల్ల బాధితులు మానసికంగా కృంగిపోయి, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
ఇలాంటి ఘటనలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో అందిస్తున్న కరోనా వైద్యసేవల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఎంజీఎం దవాఖానలో వైద్యసేవల పర్యవేక్షణకు జిల్లా వైద్యాధికారితో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారితో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు అందుతున్న సేవలతో పాటు ప్రత్యేకంగా ఎంజీఎం సేవలను సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రోజూ పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సూచనలు ఇస్తున్నారని తెలిపారు. ఎంజీఎంలో సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని మంత్రి అభినందించారు.