నారాయణపేట :
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగిస్తున్న జంబో బ్యాలెట్ బాక్సులను సిబ్బంది తీసుకువెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. బుదవారం బ్యాలెట్ బాక్స్ ల పంపిణి కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆదివారం జరగబోయే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ మండలి (MLC) ఎన్నికలకు సంబందించిన బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రంమైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను పరిశీలించారు.
ఎన్నికల అధికారులకు పంపిణీపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల అధికారులకు అందజేసే బాక్సులను పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. పీఓలు, ఏపీఓలకు బాక్స్లను ఇబ్బంది లేకుండా తీసుకొని పోయే విధంగా చూడాలన్నారు. సిబ్బందికి అందచేసే కిట్ లో కొవిడ్ కిట్ (శానిటైజర్, గ్లౌవ్స్, మాస్క్ లు) తప్పనిసరిగా అందజేయాలని సంబంధిత అధికారికి సూచించారు. ఎన్నికల కేంద్రాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డిపిఓ మురళి, వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ తదితరులు ఉన్నారు.