పవన్ కళ్యాణ్ లాంటి హీరో నుంచి ఒక సినిమా విడుదలైనప్పుడు అభిమానులు కచ్చితంగా తొలిరోజు వసూళ్ళ గురించి ఆరా తీస్తారు. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఓల్డ్ రికార్డ్స్ కొట్టిందా లేదా అనేది వాళ్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అలాగే మిగిలిన హీరోల సినిమాలతో కూడా పోలుస్తారు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా విషయంలో కూడా ఇదే చేస్తున్నారు అభిమానులు. అయితే వాళ్ల ఊహలకు ఊహించని బ్రేక్ వేశాడు నిర్మాత దిల్ రాజు. పవన్ కళ్యాణ్ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసింది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కనీసం ఇంత వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు.
ఈ సినిమా వసూళ్ల లెక్కలు బయట పెట్టొద్దు అంటూ స్వయంగా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్లకు చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. దీని వెనక మరో కథ కూడా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సినిమాపై కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. అక్కడ టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారు అంటూ అధికార పార్టీ ఈ సినిమాపై నిప్పులు జరిగింది. ఎందుకు టికెట్ రేట్లు పెంచాలి సామాన్యులపై భారం వెయ్యాలి అంటూ వైసిపి నేతలు ఫైర్ అయ్యారు. మరో వైపు ఈ టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు స్టే విధించింది. ఇంత గందరగోళం మధ్య తొలిరోజు వసూలు ఎలా బయట పెట్టాలి అనేదానిపై డిస్ట్రిబ్యూటర్లకు కూడా తలకు మించిన భారం అయింది.
పెంచిన టికెట్లతో వసూళ్లను చెప్పాలా లేదంటే నార్మల్ టికెట్ రేట్స్ తో వచ్చిన వసూలు లెక్క చేయాలా అనేది డిస్ట్రిబ్యూటర్లకు అర్థం కాలేదు. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు తొలి రోజు వసూలు బయట పెట్టవద్దు.. కలెక్షన్లు చెప్పనంత మాత్రాన ఏం జరగదు అని ఆయన బయ్యర్లకు సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తొలిరోజు దాదాపు 35-40 కోట్ల మధ్య వసూలు చేసిందని తెలుస్తోంది. రెండో రోజు కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తుంది. అయితే ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత అయినా వసూళ్ళు బయటకు వస్తాయో లేదో తెలియాలి.