జగిత్యాల, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎదురులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ దూసుకెళ్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలో మంగళవారం జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ నూత న పాలకవర్గం అభినందన సభలో వారు పాల్గొన్నారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. సమైక్య పాలనలో గ్రంథాలయాలు ఆదరణ లేక నీరసించి పోగా.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రంథాలయాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 23 కొత్త జిల్లాల్లోనూ ప్రభుత్వం గ్రంథాలయాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి గ్రంథాలయానికి పూర్తిస్థాయి భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లను మంజూరు చేస్తున్నామని, వాటితో గ్రంథాలయాలను అనుసంధానం చేయాలన్నారు.
రాష్ట్రంలో యువతకు, విద్యార్థులకు ఉపయోగపడేలా పటిష్టమైన లైబ్రరీ వ్యవస్థ అందుబాటులోకి తెస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. విద్యతోనే వివేకం, వివేకంతోనే వికాసమన్నారు. చదువు ఉన్నప్పుడే ఏది మంచి, ఏది చెడు అన్న అంశంపై అవగాహన వస్తుందని ఆమె పేర్కొన్నారు. అనేక పుస్తకాలు చదివిన విజ్ఞానంతో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, చాలామంది విఫలమైన చోట విజయం సాధించినట్టు చెప్పారు. పుస్తకం అత్యంత మహత్తరమైందన్నారు. పైసా ఖర్చులేకుండా, మనిషిని మరో ప్రపంచంలోకి తీసుకుపోయే మహత్తర శక్తి పుస్తకమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి బిడ్డకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వివరించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పటిష్ట రాజకీయ శక్తిగా ఉన్నదని, భవిష్యత్తులోనూ ఉంటుందని చెప్పారు. కార్యక్రమం లో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.