సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, జూలై 2: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ)ను న్యాయ వ్యవస్థకు ‘రక్షకుడి’గా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపే ప్రేరేపిత దాడుల నుంచి బార్ రక్షణ కల్పిస్తుందని అన్నారు. ఈ నెల 4న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ వీడ్కోలు సభను గురువారం వర్చువల్గా నిర్వహించారు. ఎస్సీబీఏ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడులు జరిగినప్పుడు అండగా నిలువడంలో ఎస్సీబీఏ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. జస్టిస్ అశోక్ భూషణ్ తన గొప్ప తీర్పులతో న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేయడంతో పాటు మానవతావాదిగా దేశ ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారని కొనియాడారు.