వాణిజ్య సినిమాలు మొదలుకొని కుటుంబ, ప్రేమకథా చిత్రాల వరకు తనదైన శైలి బాణీలను అందిస్తూ తెలుగులో అగ్రశ్రేణి స్వరకర్తగా కొనసాగుతున్నారు దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం ఆయన భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం ప్రకటించింది. శర్వానంద్ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ తొలిసారి బాణీలను అందిస్తుండటం విశేషం. ‘ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ప్రేమ, వినోదం అంశాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్సారంగ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం: కిషోర్ తిరుమల.