అమరావతి : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటల పాటు పోలింగ్ కొనసాగనున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలుపొందిన బల్లి దుర్గా ప్రసాద్ గతేడాది సెప్టెంబర్లో కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 17 లక్షల 11 వేల 195 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట సెగ్మెంట్లలో జరిగే పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీరు సహా ఇతర సదుపాయాలు కల్పించారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా వేయనున్నట్లు తెలిపారు. ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా… ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం 13 వేల 827 మంది రాష్ట్ర పోలీసులు, 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 877 పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల్ని మోహరించారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 466 పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తున్నారు.