చరిత్రకెక్కని చరిత్ర శ్రీ పూర్ణేలింగేశ్వర క్షేత్రం
నదిఅగ్రహారంలో కొలువైనఎర్రబండ(ఎర్రగట్టు)
పునరుద్ధరణ చేస్తున్న భక్తులు
అభివృద్ధి చెందుతున్న వైన
గద్వాలటౌన్, మే1: గద్వాల సంస్థానం పాలనలోనే కాకుండా కళలలోని భక్తిలోనూ ఎంతో ప్రసిద్ధి చెందింది. సంస్థానాధీశుల పాలనలో ఎన్నో ఆలయాలు నిర్మించబడ్డాయి. ఎన్నో ప్రాంతాలు పుణ్యస్థలాలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది నదిఅగ్రహారం. ఇది రాముడు నడయాడిన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. లక్ష్మణుడు అలిగి వెళ్లిన ప్రాంతంగా కూడా చెప్పుకొంటారు. అలాగే దుర్గామాత శక్తి సంచారిగా సంచరించిన స్థలంగా చెప్తారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ప్రాంతంలో మరో పుణ్య క్షేత్రం కూడా ఉన్నది. క్షేత్రం నదిఅగ్రహారంలో కృష్ణానది మధ్యలో ఉంది. దీన్నే ఎర్రబండ, ఎర్రగట్టు అని పిలుస్తారు. గట్టుపై మహాశివుడు లింగరూపంలో స్వయంభూగా వెలిశాడు. అలాగే విఘ్నేశ్వరుడు కూడా స్వయంభూగానే వెలిశాడు. అయితే కాలక్రమంలో నీటి ప్రవాహానికి లింగరూపం, విఘ్నేశ్వర రూపాలు కరిగిపోయాయి. ఈ మధ్యనే శ్రీ కృష్ణవేణి సంపూర్ణ నది హారతి సేవా సమితి, భక్తులు గట్టును అభివృద్ధి చేశారు.
ఎర్రబండ(ఎర్రగట్టు) విశిష్టత
నదిఅగ్రహారం సమీపాన ప్రవహిస్తున్న కృష్ణానది మధ్యలో ఎర్రగట్టు ఉంది. గట్టుపై ప్రతి నిత్యం ముగ్గురు అవధూతలు తపస్సు చేసేవారని చరిత్ర చెబుతుంది. అవధూతల్లో శ్రీ యోగానందస్వామి, శంభునాథ స్వామి, తుల్జారాం స్వామి అనే ముగ్గురు స్వాములు స్నేహితులుగా ఉండేవారట. ఈ ముగ్గురు కలిసి యోగానంద మఠంలో ప్రత్యేకమైన స్థలంలో తపస్సు చేసేవారు. నిత్యం వేకువ జామునే నదిఅగ్రహారంలో గల కృష్ణానది మధ్యలోని ఎర్రగట్టుకు గుహ మార్గాన వెళ్లి స్నానాలు ఆచరించే వారు. అనంతరం మహాశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తపస్సును ఆచరించేవారు. తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమై తపస్సు చేసిన గట్టును సిద్ధక్షేత్రంగా పిలువబడుతుందని, గట్టుపై తనను కొలిచిన వారికి శుభాలు కలుగుతాయని అనుగ్రహం ఇచ్చారని చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ ముగ్గురు అవధూతల మఠాలు పట్టణంలో ఉన్నాయి. ప్రతి ఏడాది ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
ప్రాచుర్యంలో మరో చరిత్ర
12వ శతాబ్దంలో దక్షిణ దేశం నుంచి అవధూత ఒకరు కృష్ణా తీరానగల అగ్రహారం అనే గ్రామానికి చేరుకున్నాడు. నదిలో శ్రీరాముని పాదం చూసి ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉందని అగ్రహారంలోనే అవధూత ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ అవధూత నదిలో ఎర్రని రంగు గల బట్టపై కూర్చొని తపస్సు చేస్తుండేవాడు. ఆ బట్టనే ఎర్రబండ (ఎర్రగట్టు)గా గుర్తింపును పొందింది. తపస్సు అనంతరం అవధూత నది కుడివైపు ఉన్న గుట్టపైకి చేరి దైవ ప్రార్థనలో ఉండేవాడు. ఒకనాడు 12వ శతాబ్ధానికి చెందిన ఒక రాజు అటువైపుగా వస్తూ అవదూతను కలిశాడు. ప్రతినిత్యం నీవు నీటిపై ఎలా వెళ్లి తపస్సు చేస్తున్నావని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అందుకు అవధూత తాను ఎర్రబట్టపై వెళ్లి వస్తానని చెప్పాడు. ఆ సమాధానాన్ని రాజు నమ్మకపోవడంతో స్వయంగా రాజును ఎర్రబట్టపై కూర్చోబెట్టుకుని నది మధ్యలోకి తీసుకెళ్లి తిరిగి వచ్చాడు. దీంతో రాజు అవధూతను తాను చేసిన తప్పును క్షమించమని కోరాడు. ఇందుకు అవధూత స్పందిస్తూ తాను తపస్సు చేసిన బట్టనే రాబోయే రోజుల్లో ఎర్రబండగా పిలువబడి నిత్య పూజలు అందుకుంటుందని చెప్పాడు.
సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి
అవధూతలు నిత్య తపస్సులు నిర్వహించిన ప్రాంతంగా పిలువబడే ఎర్రబండ(ఎర్రగట్టు) సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అలాగే చుట్టూ నీరు ఉండటం కారణంగా ఎర్రగట్టు తీర్థక్షేత్రంగా పిలువబడుతుంది. క్షేత్రంపై కొలువు దీరిన విఘ్వేశ్వరుడిని, శ్రీ పూర్ణలింగేశ్వరస్వామిగా కొలువుదీరిన మహాశివుడిని దర్శించుకున్నంతనే సకల పాపాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి.