సోషల్ మీడియా వేదికగా బీజేపీ భారీ కుట్ర
మైనర్లను పావుగా వాడుకుంటున్న పార్టీ
తమ పబ్బం గడుపుకొనేందుకు దిగజారుడు రాజకీయం
రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితులై రోడ్డున పడుతున్న అమాయకులు
తీరు మార్చుకోవాలని బీజేపీకి ఆయా వర్గాల ప్రజల సూచన
నిజామాబాద్, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీరుపై ప్రజల్లో తీవ్రమైన అసహనం వ్యక్తం అవుతోంది. పొద్దున లేచిన దగ్గరి నుంచి పొద్దుపోయే వరకు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారమే ఎజెండాగా పని చేసే బీజేపీ వ్యవహారం ఇప్పుడు ఒక్కోటి బట్టబయలు అవుతున్నాయి. రాష్ట్రం ఆరున్నరేండ్ల కాలంలో దేశంలో ఎక్క డా జరగని అభివృద్ధికి నోచుకుంది. స్వయంగా కేంద్రమే ఆయా సందర్భాల్లో సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపిస్తోంది. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక బీజేపీ దిగజారుడు రాజకీయానికి తెర లేపింది. ఢిల్లీ పెద్దల సూచనలతో రాష్ట్రంలో మైనర్లను పావుగా మార్చుకుని సోషల్ మీడియాలో వారితో అకౌంట్లు ఓపెన్ చేయిస్తోంది. ఇలా దొంగ అకౌంట్లు తీయించి మైనర్లతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతున్నది. నేరుగా అభివృద్ధిపై చర్చించే దమ్ములేక బీజేపీ చేస్తున్న ఈ కుటిల నీతిపై ఇంటా బయట విమర్శలు పెరుగుతున్నాయి. బీజే పీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అసభ్యకరంగా మాట్లాడుతూ యువతను రెచ్చగొట్టి తమవైపు తిప్పుకుంటున్నారు.వారితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అకౌంట్లు తీయించి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తీరా అసభ్యకర పోస్టులపై పోలీసులకు సంబంధీకులు ఫిర్యాదు చేస్తుండడంతో అభం శుభం తెలియని అమాయకులు కటకటాల పాలవుతుండగా… రెచ్చగొట్టిన బీజేపీ నాయకులు మాత్రం సురక్షితంగా బయట ఉండిపోతున్నారు.
మైనర్లను అడ్డం పెట్టుకుని…
రాజకీయం అంటే ప్రజలకు ఉపయోగమయ్యేట్లు ఉండా లి. రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉండాలి. చేసింది చెప్పుకోవాలి. చేయబోయేది ప్రజలకు వివరించాలి. ఎన్నికల సమయంలో తాడోపేడో ప్రజల మధ్య తేల్చుకోవాలి. ఇదీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. 18 ఏండ్లు నిండిన ఓటర్లను తమవైపు తిప్పుకుని ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాలి. అంతేగానీ… భారతీయ జనతా పార్టీ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ప్రజల మధ్య వైషమ్యాలు వెదజల్లడం. ఘర్షణలకు తావిచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం. యువతను భావోద్వేగపూరిత ప్రసంగాలతో రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకు రావడమే పరమావధిగా బీజేపీ పని చేస్తున్నది. ఇందుకు రెండు రోజుల క్రితం సైబర్ పోలీసులకు చిక్కిన ఓ బాలుడి ఉదంతమే తార్కాణంగా నిలుస్తున్నది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఏడో తరగతి బాలుడిని అడ్డం పెట్టుకుని ఫేక్ జీమెయిల్ ఐడీలు, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు, దొంగ ఇన్స్టాగ్రాం అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లను తెరిపించారు. ఆ బాలుడితో నిత్యం విష ప్రచారం చేయించడం బీజేపీ నాయకుల పని. సినిమా పాటలకు సీఎం కేసీఆర్ చిత్రాలను అతికించి కించపరిచే లా పోస్టులు. వాటిని యూట్యూబ్లో పెట్టడంతో పాటు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం పరిపాటిగా మారింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కూపీ లాగితే అసలు కథ బయట పడింది. పదుల సంఖ్యలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయించి బీజేపీ నాయకులు స్వయంగా సీఎంపై విష ప్రచారానికి తెగబడిన తీరు తేటతెల్లమైంది. భారతీయ జనతా పార్టీ చిల్లర రాజకీయాలపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాన్సువాడలోనూ ఇదే తీరు…
కొద్ది రోజుల క్రితం బాన్సువాడలో బీజేపీలోకి ఓ కాంగ్రెస్ నాయకుడు చేరాడు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలు, అసత్యాలు వల్లించాడు. వేల సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్లు కట్టించినా బాన్సువాడలో ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వలేదని విమర్శ చేసి నవ్వుల పాలయ్యాడు. పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కూత వేటు దూరంలోనే నిర్వహించిన సభలో బండి సంజయ్ తప్పుడు మాటలు మాట్లాడి… తనను తాను గల్లీ లీడర్ స్థాయికి దిగజార్చుకున్నాడు. బండి సంజయ్ మాట్లాడుతున్న సమయంలో ఓ బాలుడి హావభావాలు సోషల్ మీడియాలో బీజేపీ వైరల్ చేసింది. వాస్తవానికి బండి సంజయ్ ప్రసంగం ఒకటికి రెండు సార్లు వింటే కానీ అవతలి వ్యక్తులకు సరిగా అర్థం కాదని భారతీయ జనతా పార్టీలోని నేతలే బహిరంగంగా చెప్పుకుంటారు. అలాంటిది… ఓ పదేండ్ల బాలుడు బండి సంజయ్ మాటలకు, ప్రభుత్వ వ్యతిరేకతకు స్పందించాడంటూ వక్రభాష్యం చెబుతూ ఓ వీడియోను వైరల్ చేశారు. మైనర్ను అడ్డం పెట్టుకుని తమ మైలేజ్ పెంచుకునేందుకు బీజేపీ నేతలు పడరాని పాట్లు పడ్డారు. బాలుడిని అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడిపారు. తీరా అవసరం తీరాక సదరు బాలుడిని పట్టించుకునే వారే కరువయ్యారు. బాగా చదువుకుని ప్రయోజకుడిగా కావాలని చెప్పాల్సిన బీజేపీ నేతలు… ఓ పార్టీపై వ్యతిరేకతను పెంచే విధంగా లేలేత పిల్లవాడిలో విష బీజాలు నాటడంపై ప్రజలంతా దుమ్మెత్తి పోస్తున్నారు.
రెచ్చగొట్టి… రొంపిలోకి దించి…
గడిచిన కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ నీతిమాలిన రాజకీయం చేస్తోందంటూ సోషల్ మీడియాలో మేధావులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆయా సోషల్ మీడియా వేదికలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నదని ఆరోపణలు చేస్తున్నారు. లక్షలాది సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ భావోద్వేగంలో మునిగి తేలుతున్న వారిని తమవైపు తిప్పుకుని వారి జీవితాలతో ఆటాడుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫేక్ అకౌంట్లతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వాటిలో బీజేపీ, వాటి అనుబంధ సంఘాలకు చెందిన వారే ఎక్కువగా బయట పడుతుండడమూ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. మొదటగా వాట్సాప్ గ్రూపుల ద్వారా 18 ఏండ్ల లోపు యువతను తమవైపు తిప్పుకోవడం… తీరా రెచ్చగొట్టే ప్రసంగాలు, వీడియోలతో ఇతరులపై బురద జల్లే విధంగా వారితో తప్పటడుగులు వేయించడానికి బీజేపీ భారీగా ప్రయత్నాలు చేస్తున్నదని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఏడో తరగతి చదువుతున్న మైనర్ను పావుగా వాడుకుంటూ వందలాది ఫేక్ అకౌంట్లతో విషం కక్కించే ప్రయత్నం చేయడం ఇందులో భాగమేనని తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి
కరోనా కేసులలో బ్రెజిల్ను దాటేసిన భారత్..!