అనుకూలిస్తున్న వర్షాలు
48వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు
పెరుగనున్న సోయా విస్తీర్ణం
బోథ్, జూన్ 20: వర్షాలు అనుకూలిస్తుండడంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మృగశిర కార్తె మొదలుకొని విత్తనాలు మొలకెత్తడానికి అనువుగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బోథ్ మండలంలో 48వేల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా వాణిజ్య పంటలైన పత్తి , సోయా, కంది వేస్తున్నారు. మార్కెట్లో సోయాబీన్కు ధర పెరగడంతో రైతులు ఈ సంవత్సరం సోయా పంటవైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 15 వేల ఎకరాల్లో సోయాను రైతులు వేస్తున్నారు. పత్తి పంట గత ఏడాది కంటే స్వల్పంగా తగ్గించి 29 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. 4,500 ఎకరాల్లో కంది, మినుము, పెసర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది పత్తి దిగుబడి తగ్గడంతో చాలా మంది రైతులు సోయాసాగు విస్తీర్ణం పెంచుతున్నారు. సోయా పూర్తయ్యాక యాసంగిలో శనగ, మక్క, జొన్న పంటలు సాగు చేయడానికి వీలుండడంతో ఆపంట వైపు మొగ్గు చూపుతున్నారు. మిరుగులో విత్తనాలు మొలకెత్తితే దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుందని రైతులు సంబురపడుతున్నారు.
ఇంద్రవెల్లి మండలంలో..
ఇంద్రవెల్లి, జూన్ 20: మండలంలోని ఇంద్రవెల్లి, ముత్నూర్, కెస్లాగూడ, ఏమాయికుంట, ధనోరా(బీ), అంజి, మర్కాగూడ, దస్నాపూర్, పిట్టబొంగురం. వాల్గొండా, హీరాపూర్, కెస్లాపూర్, వడగాం, దోడంద, గట్టెపల్లి, గ్రామాల్లో రైతులు సోయా విత్తనాలు పోస్తూ కనిపించారు. వర్షాలు అనుకూలంగా కురువడంతో రైతులు పంటల్లో డౌరలు కొడుతూ పిచ్చిమొక్కలను తొలగించారు.
వర్షాలతో మొలక శాతం బాగా ఉంది
వర్షాలు కురుస్తుండడంతో మొలక శాతం బాగానే ఉంది. పత్తి విత్తనాలు వేయడం దాదాపు పూర్తయింది. రైతులు సోయా విత్తనాలు వేస్తున్నారు. నేలలో తేమ శాతం బాగా ఉండడంతో సోయా విత్తనాలు మొలకెత్తుతున్నాయి. సోయా విత్తనాలు వేయని రైతులు ఈ నెలాఖారు వరకు కూడా వేసుకోవచ్చు. -వెండి విశ్వామిత్ర, బోథ్ వ్యవసాయాధికారి