ముంబై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ అరెస్టయిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో హిందీ భామ అనన్య పాండేను కూడా నార్కొటిక్స్ బ్యూరో అధికారులు విచారణకు తీసుకెళ్లారు. ఆర్యన్కు రెండు, మూడుసార్లు డ్రగ్ డీలర్ల నెంబర్లు ఆమె ఇచ్చినట్లు ఎన్సీబీ అధికారులు ఆరోపించారు.
ఎన్సీబీ విచారణకు హాజరైన అనన్య తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని తేల్చిచెప్పింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించింది. అయితే ఆర్యన్, అనన్య మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ పరిశీలించిన అధికారులు 2018-19 మధ్య కనీసం మూడుసార్లు ఆర్యన్కు డ్రగ్స్ అందేలా ఆమె ఏర్పాట్లు చేసినట్లు ఆరోపించారు.
వీటిలో రెండుసార్లు ఆర్యన్కు వ్యక్తిగతంగా, ఒకసారి గెట్ టుగెదర్ పార్టీలో ఆమె డ్రగ్స్ ఏర్పాటు చేసిందట. ఆర్యన్కు కొందరు డ్రగ్ డీలర్ల నెంబర్లను కూడా ఆమె అందించిందని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. ఒకానొక సందర్భంలో తనకు ‘జుగాద్’ కావాలని ఆర్యన్ ఆమెను అడగ్గా ‘నేను ఏర్పాటు చేస్తా’ అని ఆమె బదులిచ్చినట్లు సమాచారం.
ఈ చాట్స్ విషయంలో అనన్యను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించగా తాను జోక్ చేశానని ఆమె బదులివ్వడం గమనార్హం. తనకు డ్రగ్స్తో అసలు సంబంధం లేదని, ఆర్యన్తో కేవలం జోక్ చేశానని ఆమె చెప్పిందని తెలుస్తోంది. అలాగే తమ మధ్య జరిగిన సంభాషణ సిగరెట్స్ గురించని, డ్రగ్స్ గురించి కాదని ఆమె చెప్పింది.
ముంబై నుంచి గోవా వెళ్తున్న ఒక క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ షారుఖ్ తనయుడితోపాటు మరో 8 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.