సికింద్రాబాద్, ఏప్రిల్ 25 : కరోనా విపత్కర పరిస్థితుల్లో కొందరు తమకు తోచిన సాయం చేస్తూ బాధితులకు సాంత్వన కలిగిస్తున్నారు. అత్యవసర సందర్భాల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపకరించే రెమ్డెసివిర్ ఇంజక్షన్ కొరత ఉండడంతోపాటు దొరకక కొందరు మృత్యువాత పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కరోనా బాధితులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. తన సొంత వ్యయంతో సికింద్రాబాద్ శ్రీకర ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించి ఇంజక్షన్లను ఉచితంగా ఇచ్చేలా సిద్ధం చేశారు. అలాగే ప్రాణవాయువు ఆక్సిజన్ సిలిండర్ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. గతేడాది జూన్ నుంచి ఉచిత సిలిండర్ పంపిణీ ప్రారంభించగా, ఇప్పటివరకు వందలాదిమందికి ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. లాక్డౌన్ కాలంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో దాదాపు 11 వేల కుటుంబాలకు రూ.కోటి 25 లక్షల సొంత నిధులతో నిత్యావసర సరుకులు అందజేయడంతోపాటు అన్నదానం చేశారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసం నామాలగుండులోని క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.