బిగ్ బాస్ 4 అయిపోయి 4 నెలలే కదా అయింది.. అప్పుడే సీజన్ 5 గురించి చర్చ మొదలైందా అనుకుంటున్నారా..? అంతే మరి.. ఇప్పుడు ఆ టైమ్ కూడా ఇచ్చేలా కనిపించడం లేదు అభిమానులు. ఎందుకంటే మెల్లగా బిగ్ బాస్ షోను మన ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. మొదటి మూడు సీజన్స్ తో పోలిస్తే 4వ సీజన్ కరోనా సమయంలో కూడా ఈ పక్కాగా ఆర్గనైజ్ చేయడంతో బిగ్ బాస్ బాగానే సక్సెస్ అయింది. తెలియని మొహాలను ఇంట్లోకి పంపించినా కూడా రచ్చ రచ్చ చేసారు. రేటింగ్స్ పరంగా కూడా స్టార్ మా చాలా ఆనందంగా ఉంది. అందుకే వచ్చే సీజన్ ఇంతకంటే గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 4లో అభిజీత్, అఖిల్ చివరి వరకు పోరాడి నిలిచారు. అందులో అభి విన్నర్ అయ్యాడు.
ట్రోఫీ చేతిలో పట్టుకుని మీ ఇంటికి నేను మహానాయకుడు అయ్యాను బిగ్ బాస్ అంటూ గర్వంగా చెప్పుకొచ్చాడు అభిజీత్. అఖిల్ అక్కడ ఓడిపోయినా బయటికి వచ్చిన తర్వాత కెరీర్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోవైపు మూడో స్థానంలో నిలిచిన సోహెల్ కూడా బయటికి వచ్చిన తర్వాత రెండు సినిమాల్లో హీరోగా ఫిక్స్ అయ్యాడు. అక్కడ బిగ్ బాస్ లో కూడా 40 లక్షల వరకు గెలిచాడు. ఇదిలా ఉంటే సీజన్ 4 అయిపోయింది.. దాంతో అందరూ వచ్చే సీజన్ గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సీజన్ 5పై అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. గతేడాది కరోనా కారణంగా నాలుగు నెలలు ఆలస్యంగా మొదలైంది సీజన్ 4.
2021లో కూడా ఇదే జరుగుతుంది. ఈ సారి కూడా కరోనా ఉండటంతో సీజన్ 5 కోసం మరో ఆర్నెళ్లు వేచి చూడాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ రెండో వారంలో సీజన్ 5 మొదలయ్యేలా కనిపిస్తుంది. ఈ సారి కూడా నాగార్జున హోస్ట్ చేస్తాడు.. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. హోస్టుగా సెట్ అయిపోయాడు నాగార్జున. ఫినాలేలో చిరంజీవి కూడా ఇదే చెప్పాడు. ఒకటి కాదు మరో 10 సీజన్స్ అయినా నాగార్జుననే ఉంటాడని. సీజన్ 5 మరింత గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. పైగా బిగ్ బాస్ 5 తెలుగులో ఎక్కువగా కాంట్రవర్సీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే సీజన్ 5 కోసం షణ్ముఖ్ జస్వంత్, టిక్ టాక్ దుర్గా రావు, సింగర్ సునీత లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.