అస్తవ్యస్తంగా గ్రామ వీధులు
పూర్తికాని వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణం
పడకేసిన పారిశుధ్యం.. నిండిన డ్రైనేజీలు
వీధిలైట్లు వెలుగక అంధకారంలో గ్రామస్తులు
బాలానగర్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ‘పల్లెప్రగతి’ పేరుతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించి నిధులు కేటాయించింది. కానీ, మండలంలోని గౌతాపూర్ గ్రామం మాత్రం పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ పాలకసభ్యులు, పంచాయతీ అధికారులు మధ్య సమన్వయలోపంతో ప్రభుత్వ ఆశయం నేరవేరడంలేదు. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. గౌతాపూర్ పంచాయతీలో మాత్రం అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. డ్రైనేజీలు, వీధిలైట్లు, రోడ్లు సక్రమంగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. హరితహారం కింద నాటిన మొక్కలు సంరక్షణ లేక ఎండిపోతున్నాయి. అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి.
మొక్కలకు రక్షణ కరువు
హరితహారంలో భాగంగా గ్రామం నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కానీ వాటి సంరక్షణ లేక చాలా మొక్కలు చనిపోయాయి. ప్రస్తుతం ఉన్నవి కూడా పెరగడం లేదు. పంచాయతీ పరిధిలో చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాటలేదు. ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజూ నీరు అందించేందుకు ప్రభుత్వం ట్రాక్టర్, ట్యాంకర్ సమకూర్చినా మొక్కలకు నీరుపోసే దిక్కు లేకుండా పోయింది. గ్రామంలో నాటిన మొక్కలను కలెక్టర్ వెంకట్రావు పరిశీలించినా ఫలితం లేదు. మొక్కలను సంరక్షించుకోవాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా ఫలితం లేదు. రోడ్లకు ఇరువైపులా ఉన్న మొక్కలు నీళ్లులేక ఎండిపోయాయి.
రోడ్లన్నీ మడుగులే..
గ్రామంలోని అన్ని వీధుల్లో రోడ్లపై మురుగు పారుతున్నది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. గ్రామంలో 8వార్డులు ఉండగా నాలుగు వార్డుల్లో ఇదే పరిస్థితి. కాల్వల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీలు నిండి కంపుకొడుతున్నాయి. పల్లె ప్రకృతివనం ఏర్పాటైనా నామమాత్రంగానే ఉన్నది. గ్రామ శివారులోని గుట్టల పక్కన ఏర్పాటు చేసిన వనంలో వాకింగ్ ట్రాక్ను పూర్తి చేయకుండానే వదిలేశారు.
నత్తనడకన అభివృద్ధి పనులు
గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2016లో రూ.13లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు నేటీకి పూర్తి కాలేదు. ఫలితంగా అద్దె భవనంలో పంచాయతీ పాలన సాగుతున్నది. డంపింగ్ యార్డు నిర్మించినా వినియోగించడం లేదు. గ్రామంలో ఉన్న నల్లాలకు ట్యాప్లు బిగించకపోవడంతో తాగునీరు వృథా అవుతున్నది. వీధులు లైట్లు లేకపోవడంలో రాత్రివేళలో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారం కావడం లేదని సర్పంచ్ విద్యుత్ ఏఈకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కరెంట్ సమస్యను తీర్చాలి
గ్రామంలో కరెంట్ సమస్య ఉంది. అధికారులకు, సర్పంచ్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. రాత్రి వేళల్లో చాలా భయంగా ఉంటుంది. ఇండ్లలోకి పాములు, ఎలుకలు, పురుగులు వస్తాయి. సీసీరోడ్లు లేవు. మురుగు కాల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సీసీరోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. అభివృద్ధి పనులు చేయాలి.
పద్మమ్మ, గృహిణి, గ్రామస్తురాలు
డ్రైనేజీలు, సీసీరోడ్లు నిర్మిస్తాం
గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉన్న మాట వాస్తవమే. సమీప పొలాల నుంచి జాలు రావడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఈ సారి డ్రైనేజీ, సీసీ రోడ్లపై దృష్టి సారించాం. హరితహారం కింద నాటిన మొక్కలు కొన్ని చనిపోయాయి. ఆ స్థానంలో కొత్తవి నాటుతున్నాం. పంచాయతీ భవనం, వైకుంఠధామం పూర్తి కావొచ్చింది.
ప్రీతి, పంచాయతీ కార్యదర్శి
త్వరలో సమస్యలు పరిష్కరిస్తా..
గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం. పంచాయతీ ఫండ్ టైంకు రాకపోడంలో తీవ్ర జాప్యం జరగడం వల్ల పనులు నత్తనకడన కొనసాగుతున్నాయి. గ్రామస్తుల సహకారంలో గ్రామాన్ని అదర్శంగా తీర్చి దిద్దుతాను. పంచాయతీ భవనం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పూర్తికాలేదు. త్వరలో భవనం అందుబాటులోకి తెస్తాం. అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం.
రమేశ్, సర్పంచ్, గౌతాపూర్