జాగృత తెలంగాణ ప్రథమ సామాజిక గళం, అనర్గళ గళం- ‘కాకతీయ’ వారపత్రిక. ఇక్కడి ప్రజల భాష తెలుగులో ప్రచురితమయింది. ‘కాకతీయ’ వారపత్రిక స్థాపకులు, సంపాదకులు, సారథులు, సవ్యసాచులు పాములపర్తి వెంకట నరసింహారావు (పి.వి.), ఆయనకు అత్యంత ఆప్తుడు, సైద్ధాంతిక సన్నిహితుడు పాములపర్తి సదాశివరావు. దాదాపు డెబ్బయి అయిదు సంవత్సరాల కిందట, పీవీ కార్యక్షేత్రమైన ఓరుగల్లు నగరం నుంచి ‘కాకతీయ’ వారపత్రిక ప్రచురితమైంది. ‘కాకతీయ’ వార్షిక సంచికలు, ప్రత్యేక సంచికలు విజ్ఞాన, విశ్లేషణాత్మక రచనలతో ప్రచురితమైనాయి. ఈ సంచికలలో ఒక్కొక్కటి ఒక విజ్ఞాన పేటిక, సమాచార వాటిక.
పీవీ పైలాపచ్చీసు యువప్రాయంలో కాకతీయ పత్రిక ప్రచురణ ప్రారంభించి అందులో సామ్యవాద, ప్రజాస్వామ్య భావ ఆవేశాన్ని ప్రదర్శించారు. ప్రధానమంత్రి పదవి తర్వాత గూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రచురణల అవసరాన్ని గురించి ఎంతో ఆవేదనతో, ఆత్రుతతో, ఆరాటంతో నొక్కి చెప్పేవారు. ఆయన మరికొంతకాలం సజీవులై ఉన్నట్లయితే తెలుగు పత్రికా రంగానికి మరొక కాకతీయ పత్రిక నిశ్చయంగా లభించి ఉండేది.
‘కాకతీయ’ పత్రిక ప్రథమ వార్షిక సంచిక సంపాదకీయంలోని ఈ ఉద్ఘాటన గమనార్హమైనది, గురుతరమైనది- ‘కాకతీయ పత్రిక తొలి సంచిక వెలువడగలిగిన సర్వధారి దీపావళి నాటి మా అనన్యోత్సాహ అపూర్వానందాల జ్ఞాపక రేఖలు, నేటి ఈ దీపావళి నాటికింకను మనస్సులో అట్లే నిలిచియున్నవి. నాడును నేడు పవిత్ర కాకతీయోద్యమం పట్ల వర్తించే గురుతర బాధ్యతాభావం మా తన్మయతకు అడ్డుతగులుచునే ఉన్నది. అయినా ఆ భారాన్ని సహించటంలో, శిరసావహించటంలో మా ఉద్యుక్తత తరుగు చూపలేదు.. ఏ పరిస్థితులలోనైనా కాకతీయ పత్రిక శాంతి సత్యయుతమైన తన వాక్స్వాతంత్య్రాన్ని రక్షించుకొనుటలో ప్రమత్తతకు తావీయదని మరొకమారు పాఠకలోకానికి హామీనిస్తున్నాము’. కాకతీయ వారపత్రిక ప్రథమ వార్షిక సంచిక 21అక్టోబర్ 1949 దీపావళి సందర్భాన ప్రచురితమైంది.
పద్దెనిమిదేండ్ల కౌమార దశలో పీవీ నాగపూర్లో ఇంటర్మీడియెట్ ప్రథమశ్రేణిలో పూర్తిచేశారు. అప్పుడే, 1939లో, పీవీ, ఆయన మిత్రులు అప్పటి మధ్యప్రదేశ్లోని త్రిపురిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక మహాసభకు వెళ్లి వచ్చారు. అవి చరిత్రాత్మక మహాసభలు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం, సారథ్యం వహిస్తున్న గాంధీజీతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విధానపర, సైద్ధాంతిక విభేదాలు బాహాటంగా బహిర్గతమైన మహాసభలు అవి. 1938లో, హరిపుర (గుజరాత్) కాంగ్రెసు మహాసభలో నేతాజీ- కాంగ్రెసు అధ్యక్షులయినారు (మొదటిసారి). స్వాతంత్య్రోద్యమ నాయకుల విభేదాలను, నాటి రాజకీయాలను పీవీ గమనించారు, పరిశీలించారు. ఉన్నత విద్యార్జనను, మేధోమథనాన్ని ఉపేక్షించి పీవీ నేరుగా రాజకీయ రంగంలోకి రాలేదు- ఆయన విజ్ఞతకు, దూరదృష్టికి ఇదొక నిదర్శనం. 1938-48 (కాకతీయ పత్రికను ప్రారంభించింది 1948 లో) పదేండ్ల కాలంలో పీవీ ఒక గొప్ప పత్రికా సంపాదకుడికి అవసరమైన మహామేధావిగా, మహోన్నత విజ్ఞానిగా, సమరశీల ప్రజాస్వామ్యవాదిగా, ఉన్నత నైతిక వ్యక్తిత్వ భాసితుడుగా రూపొందారు. కాకతీయ పత్రికలో, అందలి విలువైన పేజీలలో పీవీ ఒక మహామనీషిగా, మానవోన్నతుడుగా కన్పించారు. ప్రథమ వార్షిక సంచిక సచిత్ర ముఖపత్రం (టైటిల్ పేజి)లోని కవితలో ఒక వాక్యం ఇది- ‘..మదపుటేనుగుపిండుజెండాడుచును గండర గండడై ఏకైన వత్సర బాలకుడు తనకేల కాగడ క్రాల దురదురసాగుచుండెను..’.
పత్రికారంగం భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాలకు, ఇతర ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచింది. దేశం లో బ్రిటిష్ పాలనకు అనుకూలంగా ఉన్న ‘ది స్టేట్స్మన్’ వంటి పత్రిక (కలకత్తా, ఢిల్లీ), బ్రిటిష్ పత్రికలు ప్రజాస్వా మ్య హక్కులను బలపరిచాయి. సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయి నౌరోజీ, లోక్మాన్య బాలగంగాధర తిలక్, గాంధీ జీ, అరవిందఘోష్, చిత్తరంజన్దాస్, లాలాలజపతిరాయ్ తదితరులు పత్రికారంగం నుంచి భారత స్వాతంత్య్ర ఉద్యమంలోనికి, రాజకీయ రంగానికి వచ్చినవారు. జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితరులు పత్రికా రంగంతో గాఢ సంబంధాలు కొనసాగించారు. నెహ్రూ మారు పేర్లతో వివిధ పత్రికల్లో ఆర్టికల్స్ రాసిన సందర్భాలున్నాయి. పీవీ పత్రికా రంగం నుంచి స్వతంత్ర భారత రాజకీయ రంగంలోనికి వచ్చారు. పీవీ పైలాపచ్చీసు యువప్రాయంలో కాకతీయ పత్రిక ప్రచురణ ప్రారంభించి అందులో సామ్యవాద, ప్రజాస్వామ్య భావ ఆవేశాన్ని ప్రదర్శించారు. పీవీ ప్రధానమంత్రి పదవి తర్వాత గూడా విశ్రాంతి తీసుకోకుండా ఈ రచయితతో ప్రచురణల అవసరాన్ని గురించి ఎంతో ఆవేదనతో, ఆత్రుతతో, ఆరాటంతో నొక్కి చెప్పేవారు. ఆయన మరికొంతకాలం సజీవులై ఉన్నట్లయితే తెలుగు పత్రికా రంగానికి మరొక కాకతీయ పత్రిక నిశ్చయంగా లభించి ఉండేది. ఆనాటి కాకతీయ పత్రికలో నాటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి కూడా విమర్శనాత్మక రచనలు ప్రచురితం కావడం పీవీ స్వేచ్ఛాయుత వైఖరికి, నిష్పక్షపాత ధోరణికి ప్రబల నిదర్శనం.
దేవులపల్లి ప్రభాకరరావు