సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతో పాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం పోసాని కృష్ణమురళి ఓ ప్రకటనను విడుదల చేశారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శకనిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. ముఖ్యంగా తాను కరోనా బారిన పడటం వల్ల రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు ఆయన విజ్ఞప్తిచేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.