చెన్నై: తమిళనాడుకు చెందిన డీఎండీకే పార్టీ అధినేత విజయ్కాంత్ భార్య ప్రేమలత కరోనా పరీక్ష చేయించుకోకుండా ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. తన భర్త పోటీ చేసిగెలిచిన విరుదాచలం స్థానం నుంచి ఈసారి ఆమె పోటీ చేస్తున్నారు. అయితే ప్రేమలత సోదరుడు, ఆయన భార్యకు ఇటీవల కరోనా సోకింది. విజయ్కాంత్ సోదరుడికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో కలిసి ఉన్న ప్రేమలతను కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యసిబ్బంది సూచించారు. అయినప్పటికీ బుధవారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం తర్వాత కరోనా పరీక్ష చేయించుకుంటానని వైద్య సిబ్బందికి తెలిపారు.
నటుడి నుంచి రాజకీయవేత్తగా మారిన విజయ్కాంత్ 2006లో డీఎండీకే పార్టీని ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికల్లో సీట్ల పంపిణీలో విభేదాల వల్ల అధికార అన్నాడీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకున్న ఆయన టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. గత ఏడాది కరోనా బారినపడిన విజయ్కాంత్, అనారోగ్య కారణాలతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలిచిన విరుదాచలంలో భార్య ప్రేమలత పోటీ చేస్తున్నారు.