ఓటీటీ మాధ్యమాల కారణంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు నటుడు రాజా రవీంద్ర. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. సత్తిబాబు దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో రాజారవీంద్ర పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఆర్ఆర్ఆర్ అనే ముగ్గురు స్నేహితుల కథ ఇది. ఇందులో నేను రాజుగారు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కనిపిస్తా. యాభై ఏళ్ల వయసు దాటిన అతడు భార్యాపిల్లలు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మధనపడుతుంటారు. ఓ సింగర్ పట్ల ఆకర్షితుడైన రాజు సోషల్మీడియాలో ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెడతాడు. ఆ పరిచయం అతడి జీవితంలో ఎలాంటి సమస్యల్ని తీసుకొచ్చిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం నవ్వించే చిత్రమిది. హాస్యాన్ని పండించడం కంటే విలన్గా నటించడమే నా దృష్టిలో సులభం. కామెడీ పాత్రలకు హావభావాలు, టైమింగ్ కుదరాలి. అప్పుడే పాత్ర బాగా పండుతుంది. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘రామారావు ఆన్ డ్యూటీ’తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నా’ అని తెలిపారు.