‘భర్త చనిపోయిన మహిళను ప్రేమించే యువకుడి కథ ఇది. అంతర్లీనంగా చక్కటి భావోద్వేగాలుంటాయి’ అని అన్నారు అల్లు అరవింద్. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. బన్నీవాస్ నిర్మాత. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. ఈనెల 19న విడుదల కానుంది.ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్ర జ్యూక్బాక్స్ విడుదల వేడుక జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘కార్తికేయ చక్కటి నటనను కనబరిచాడు. ఆద్యంతం సహజంగా సాగుతూ సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది’ అని తెలిపారు. నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ ‘కొత్త జనరేషన్ నవ్యమైన ఇతివృత్తాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఆ కోవలో నిలిచే చిత్రమిది. మాస్ క్యారెక్టర్స్తో క్లాస్గా సాగుతూ మనసుల్ని హత్తుకుకుంటుంది’ అని పేర్కొన్నారు. ‘హీరోగా కెరీర్ తొలినాళ్లలోనే గీతా ఆర్ట్స్లో సినిమా చేయడం భరోసానిచ్చింది. నానికి ‘భలే భలే మగాడివోయ్’, విజయ్ దేవరకొండకు ‘గీత గోవిందం’ మాదిరిగా ఈ సినిమా నాకు గొప్ప పేరు తీసుకొస్తుందనే నమ్మకముంది. బాలరాజు లాంటి పాత్రలు అరుదుగా లభిస్తాయి. సినిమాల పరంగా నేను చేసిన తప్పుల్ని తెలియజెప్పిన చిత్రమిది. భవిష్యత్తులో కథాంశాల ఎంపికలో ఆ పొరపాట్లను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడతా’ అని హీరో కార్తికేయ పేర్కొన్నారు. ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య ఇద్దరు పోటీపడి నటించారని దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి చెప్పారు. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గీతా ఆర్ట్స్లో నేను చేస్తోన్న మూడో సినిమా ఇది. కెరీర్లో ఇప్పటివరకు నేను విన్న గొప్ప కథగా భావిస్తున్నా’ అని చెప్పింది.