ముంబై : లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల బిగ్ బి అమితాబ్ బచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హింది సినిమా ఇక ఎప్పటికీ ఒకలా ఉండదన్నారు. ముంబైలోని హిందూజా హాస్పిటల్లో దిలీప్ కుమార్ ఇవాళ మృతిచెందిన విషయం తెలిసిందే. భారతీయ చలనచిత్ర రంగంలో ఓ వ్యవస్థ వెళ్లిపోయిందని, భారతీయ చిత్రసీమ గురించి చెప్పాలంటే.. దిలీప్ కుమార్ ముందు, దిలీప్ కుమార్ తర్వాత అని చెప్సాల్సి ఉంటుందని అమితాబ్ తన ట్వీట్లో తెలిపారు. దిలీప్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి శక్తినివ్వాలని అమితాబ్ ప్రార్థించారు. ట్రాజిడీ కింగ్ దిలీప్ మృతి పట్ల విషాదం వ్యక్తం చేసిన అమితాబ్.. ఒక అసాధారణ యుగానికి తెరపడిందని, ఇది మళ్లీ ఎన్నటికీ రాదన్నారు. దిలీప్ కుమార్, అమితాబ్లు కలిసి 1983లో రిలీజైన శక్తి సినిమాలో నటించారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్, అమిర్ ఖాన్.. దిలీప్ మృతి పట్ల నివాళి అర్పించారు.