భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ బాస్కెట్ బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆమె గురువారం భోపాల్లోని శక్తి నగర్ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న బాస్కెట్ బాల్ కోర్టుకు వెళ్లారు. బాస్కెట్ బాల్ ఆడుతున్న క్రీడాకారులను చూసి తాను కూడా ఆడాలని భావించారు. బాస్కెట్ బాల్ తీసుకుని కొంతసేపు డ్రిబ్లింగ్ చేసి విజయవంతంగా నెట్లోకి విసిరారు. ప్రగ్యా ఠాకూర్ బాస్కెట్ బాల్ క్రీడా పటిమను చూసిన బీజేపీ నేతలు, స్థానికులు, మీడియా సిబ్బంది చప్పట్లు కొట్టి అభినందించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కాగా, ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఫిబ్రవరి 19న ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. మార్చి నెలలో కూడా ఆమెకు ఇలాంటి సమస్య తలెత్తడంలో హెలీకాప్టర్లో ముంబై నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు రెండోసారి తరలించారు. అనారోగ్య సమస్యలతో వీల్ చైయిర్లో ఉన్న ప్రగ్యా సింగ్ ఠాకూర్ కోలుకోవడంతోపాటు తాజాగా బాస్కెట్ బాల్ ఆడటంపై కొందరు నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
2008 మాలెగావ్ బాంబు పేలుళ్ల ఘటనలో పది మంది చనిపోయిన కేసులో ప్రగ్యా సింగ్ ఠాకూర్ నిందితురాలు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ అనారోగ్య కారణాలతో 2017లో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసిన ప్రగ్యా ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై 3.6 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు.