జహీరాబాద్, మే 7 : ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం కోహీర్లో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో సీఎం కేసీఆర్ పేదింటి ఆడ బిడ్డల పెండ్లిలకు ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఇంగ్లిష్ మీడియం బోధన చేస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి ఆవకాశాలు కల్పించేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్లో..
అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన బిరాదర్ వీరమ్మకు మంజూరైన రూ.లక్షా 116 చెక్కును శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెండ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ పారదర్శకతతో అమలు చేస్తూ నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో జూజాల్ సర్పంచ్ జైపాల్రెడ్డి, జగన్నాథ్పూర్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.