హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మూడేండ్ల క్రితం మార్పులు చేశామని రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్చీఫ్ గణపతిరెడ్డి శనివారం పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేశారు. రీజినల్ రింగ్రోడ్డు మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం.. పట్టణాలు, గ్రామాలు, చెరువులు, కుంటలు, గుట్టలు తగులకుండా పూర్తిగా గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ రూపొందించాలని సూచించినట్టు గణపతిరెడ్డి వెల్లడించారు.
కేంద్రం సూచనల మేరకు మూడేండ్ల క్రితమే గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ను రూపొందించామన్నారు. దీని ప్రకారం 340 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్రోడ్డును మంజూరుచేయాలని కేంద్రాన్ని కోరినట్టు వివరించారు. నీరు, విద్యుత్తు వినియోగాలు, నివాసాలు, పరిశ్రమలు, వ్యాపార స్థాపనలు మొదలైనవాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. వాటిని తొలగించడానికి అవకాశం లేకుండా రూపొందించిన గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ను.. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలు సమీక్షించిన తర్వాతే కేంద్రం ఆమోదించిందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్ను ప్రతిపాదించినప్పటి నుంచి కేంద్రం 2021 మార్చిలో ఉత్తర భాగానికి ఆమోదం తెలిపేందుకు మూడేండ్లు పట్టిందని, ఈ మూడేండ్లలో మొదట ప్రతిపాదించిన అలైన్మెంట్ పరిధిలో ఇరిగేషన్ కాలువలు, రింగ్ రోడ్లు, జలాశయాలు మొదలైనవి ఏర్పడ్డాయని ఈఎన్సీ వివరించారు.
వీటిని పరిరక్షించడానికి అవసరమైతే కొన్ని మార్పులు చేస్తామని తెలిపారు. ఎక్స్ప్రెస్వే నిబంధనల ప్రకారం రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారైనందున.. వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా మార్చడం కుదరదని స్పష్టం చేశారు. భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50% భరిస్తుందని చెప్పారు. భూ సేకరణలో భారత ప్రభుత్వానికి సహాయం చేయాల్సిన బాధ్యత రాష్ర్టానికి ఉన్నందున అలైన్మెంట్ ఫైనలైజేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జోక్యాన్ని సహించదన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు అలైన్మెంట్ మార్పుకోసం ఒత్తిడి తెస్తున్నారనడం పూర్తిగా నిరాధారమని స్పష్టంచేశారు.