ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష.. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు. ఈ క్రమంలో ఆమెకు పలువురు టాలీవుడ్ సెలబ్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతున్న తొలి తెలుగమ్మాయి శిరీష కి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
శిరీష బండ్ల అద్భుతమైన ఫీట్ సాధించబోతున్నావు. తల్లిదండ్రులు, తెలుగువారు,ఇండియన్స్ అందరు గర్వపడే సమయం ఇది. మీ మిషన్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిరు పేర్కొన్నారు. అంతకముందు ‘మా బండ్ల ఫ్యామిలీ మరో ఘనతని సాధించిందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది’ అని బండ్ల గణేష్ పేర్కొన్నాడు.
ఈ నెల 11వ తేదీన తమ అంతరిక్ష వాహక నౌక యూనిటీ -22 ను ప్రయోగించనున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది. ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు ప్రకటించింది. శిరీష తల్లిదండ్రులు డాక్టర్ అనురాధ, డాక్టర్ మురళీధర్రావు చాలా ఏళ్ల క్రితమే ఈ కుటుంబం అమెరికాలోని స్థిరపడ్డారు. అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్లో శిరీష పట్టభద్రురాలు అయ్యారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం.. 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.