మహబూబ్ నగర్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పరిశీలించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా తుది డిజైన్లు పూర్తి చేసి కాలువ నిర్మాణ పనులు చేపడతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని జలసౌధలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు పూర్తి అయిన వెంటనే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలోని భూములకు సాగునీరు అందించేందుకు కాలువలు సిద్ధం చేసి ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణ పేట, మక్తల్, కొడంగల్, షాద్ నగర్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో నీళ్లు పారేటట్లు కాలువలు తవ్వటానికి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కూలంకషంగా చర్చించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులు సూచించిన కాలువల డిజైన్లు పై మంత్రి పరిశీలించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తగు సూచనలు, సలహాలు చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాలువల నిర్మాణ పనుల డిజైన్లపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
సీఎం కేసీఆర్ కాలువల డిజైన్లపై తుది నిర్ణయం తీసుకున్న వెంటనే నిర్మాణ పనులకు టెండర్లు పక్రియ మొదలు పెడ్తామన్నారు. కార్యక్రమంలో ఈఎన్సీ మురళీధర్ రావు, సీఈలు శ్రీనివాస్, రమేష్, ఎస్.ఈ కొంతం శ్రీనివాస్, ఎ.ఎస్.ఎన్.రెడ్డి పాల్గొన్నారు.