వికారాబాద్, మే 4, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ కట్టడికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సీహెచ్సీ, జిల్లా దవాఖానలో కొవిడ్ సేవలు అందిస్తున్నారు. నిత్యం 1000 మందికి పైగా టీకాలు వేస్తున్నారు. 1200 లకుపైగా పరీక్షలు చేస్తున్నారు. కలెక్టర్ పౌసుమి బసు ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రజలకు సేవలందిస్తున్నది. ప్రైవేట్ దవాఖానల్లోనూ కొవిడ్ సేవలను అందించేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలోని 20 ప్రైవేట్ దవాఖానల్లో 357 పడకలను అందుబాటులో ఉంచారు. వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామంలో కొవిడ్ సోకితే జిల్లా వైద్య బృందంతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు. 45 ఏండ్లకు పైబడిన వారు టీకాలు వేసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ కోసం స్వచ్ఛందంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్, కంప్యూటర్ http/////selfreristration.cowin.gov.in వెబ్ సైట్లోకి వెళ్లి ఫోన్ నంబర్ నమోదు చేయాలి. వెంటనే సంబంధిత ఫోన్కు వన్టైం పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డును వెబ్సైట్లో నమోదు చేయాలి. అనంతరం వచ్చే పేజీలో వ్యక్తి గుర్తింపు కోసం, ఆధార్ ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఏదో ఒక గుర్తింపు కార్డు నంబర్తో పాటు, పేరు, వయస్సు తదితర వివరాలను నమోదు చేసి, రిజిస్టర్ బటన్పైన క్లిక్ చేయాలి. నమోదు చేసుకున్నవారి వివరాలు పేజీలో కనిపిస్తాయి. ఇందులోనే మరో ముగ్గురి పేర్లను సైతం నమోదు చేసుకునే అవకాశం ఉన్నది. అనంతగిరి టీబీ దవాఖానలో తాండూరు ఎంసీఆర్ సెంటర్లో ఐసోలేషన్, ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.