అందరూ కలిసికట్టుగా పనిచేయండి
కష్టపడ్డవాళ్లకే పార్టీలో తగిన గుర్తింపు
ఓటమి ఒత్తిడిలో కాంగ్రెస్ నేత జానారెడ్డి
బీజేపీ అసలు పోటీలోనే లేదు
పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజ యం మనదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గెలుపుకోసం టీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ను ప్రకటించిన సందర్భంగా తెలంగాణభవన్లో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ జీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు రావుల శ్రవణ్కుమార్రెడ్డి, సాగర్ నియోజకవర్గ నేతలు ఎంసీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి, నోముల కుటుంబసభ్యులతో ఆయన సమావేశమై ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్సీ ఫలితాలు రిపీట్
ఇటీవల రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలే సాగర్ ఉప ఎన్నికలోనూ పునరావృతం కాబోతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే ఆయన తన అనుభవానికి భిన్నంగా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణలేదని, ఆ పార్టీ నేతల మాటలను ఎవరూ విశ్వసించటంలేదని సీఎం చెప్పారు. బీజేపీ పోటీలోనే లేదన్న విషయాన్ని గుర్తించి టీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని సూచించారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, అందుకే నర్సింహయ్య కుమారుడు భగత్కు టికెట్ ఇచ్చామని పార్టీ నేతలకు సీఎం వివరించినట్టు సమాచారం. చిన్నవయస్సులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం తీసుకోవాలని, అందరి సహకారం, సలహాలు తీసుకొంటూ ముందుకు వెళ్లాలని భగత్కు సూచించారు.
కోటిరెడ్డికి ఎమ్మెల్సీ..!
పార్టీ కోసం కష్టపడ్డవారిని విస్మరించబోమని సీఎం కేసీఆర్ చెప్పారు. సాగర్కు చెందిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఆయన సేవలను వాడుకుంటామని హామీ ఇచ్చారు. ‘భగత్ చిన్నపిల్లవాడు. అతడికి అన్ని విషయాలు తెలియవు. కొడుకుగా భావించి.. తెలియని విషయాలను తెలియజెప్పాలి. ప్రజలతో ఎలా నడుచుకోవాలి? పార్టీతో ఎలా ఉండాలి? అనే విషయాలను మీరే దగ్గరుండి చెప్పండి. ఆ పిల్లగాన్ని గెలిపించుకొని తీసుకురండి. మీ భవిష్యత్ను నాకు వదిలేయండి’ అని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు నియోజకవర్గంలోనే ఉండాలని మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లాను సీఎం ఆదేశించారు.
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నిధుల గోల్మాల్పై డీసీసీబీ సీరియస్