పల్లె ప్రగతితో మారిన గ్రామం
పచ్చదనం, పారిశుధ్యంలో నంబర్ వన్
ప్రకృతి వనం, వైకుంఠధామంతో శాశ్వత వనరులు
ఓడీఎఫ్ గుర్తింపు
పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.1.40 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మించారు. ఇటీవల గ్రామంలో సీసీ రోడ్లు సైతం వేశారు. గ్రామాన్ని ఇప్పటికే ఓడీఎఫ్గా గుర్తించారు. ప్రతి ఇంట్లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక పంచాయతీకి ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ ద్వారా సిబ్బంది ఇంటింటికీ వచ్చి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇంటింటికీ అందించిన తడి, పొడి చెత్త బుట్టలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మూడేండ్లుగా వందశాతం పన్నుల వసూళ్లతో పంచాయతీ ఆదర్శంగా నిలుస్తున్నది.
నల్లగొండ రూరల్, జూలై 12 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో నల్లగొండ మండలంలోని గుట్టకింది (జీకే) అన్నారం ఎంతో అభివృద్ధి సాధించింది. సర్కారు ప్రతి నెలా అందిస్తున్న నిధులతో ఏండ్లనాటి సమస్యలను పరిష్కరించుకుంది. గ్రామస్తులంతా కలిసి పచ్చదనం పెంపుతోపాటు పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూ ఊరును అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
గ్రామంలో జనాభాకు అనుగుణంగా ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు. ఏరోజు ఏ వర్కర్ ఎక్కడ డ్రైనెజీలు శుభ్రం చేయాలి, వీధులు శుభ్రం చేయాలి, పని చేసిన ప్రాంతంలో స్థానికుల నుంచి సంతకం తీసుకునేలా పంచాయతీ కార్యదర్శి చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీలో సైతం ప్రత్యేక టైంటేబుల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రోజువారీ శానిటేషన్ రిపోర్టు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు.
పల్లె ప్రణాళిక..
నల్లగొండ జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే జీకే అన్నారంలో 320 కుటుంబాలు ఉన్నాయి. జనాభా 1,095 మంది. గత ప్రభుత్వాల కాలంలో చెత్తా చెదారంతోపాటు అస్తవ్యస్త రోడ్లు, వీధుల్లో పారే మురుగుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవాళ్లు. పల్లె ప్రణాళికలో భాగంగా పాత బావులను పూడ్చివేశారు. వీధుల వెంట ఉన్న పాత ఇండ్లు, పిచ్చి మొక్కలు, పెంట దిబ్బలను తొలగించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తీసివేసి కొత్తవి ఏర్పాటు చేశారు. వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేసి స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు బిగించారు. దీంతో గ్రామం సరికొత్తగా మారింది.
పల్లె ప్రకృతి వనం
18 గుంటల భూమిలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసి 2 వేల మొక్కలను నాటారు. వాకింగ్ ట్రాక్తోపాటు కూర్చోవడానికి బెంచీలను ఏర్పాటు చేశారు. ఇక హరితహారంలో భాగంగా 1450 మొక్కలు నాటడంతో గ్రామంలో పచ్చదనం సంతరించుకుంది. ఈ ఏడాది హరితహారానికి గ్రామంలోని నర్సరీలో 11 వేల మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
అందరి భాగస్వామ్యంతోనే..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని పనులు చేశాం. ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మించాం. ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల భాగస్వామ్యంతోనే ఇవన్నీ చేయగలిగాం.
-పందిరి సరిత, సర్పంచ్, జీకే అన్నారం
చాలా మార్పు వచ్చింది
గతంతో పోలస్తే మా ఊరిలో చాలా మార్పు వచ్చింది. ఇంటికే వచ్చి ట్రాక్టర్లో చెత్త తీసుకుపోతున్నరు. ఏ సమస్యలున్నా చెప్తే వెంటనే పరిష్కరిస్తున్నరు. ఊళ్లో నాటిన మొక్కలన్నీ పెరిగి పచ్చగా ఆహ్లాదం పంచుతున్నాయి.