యాదాద్రి, ఏప్రిల్ 24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో శనివారం స్వామి, అమ్మవార్లకు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్చక బృందం ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసి అర్చనలు అత్యంత వైభవంగా చేపట్టారు. ఉదయం 8 గంటలకు సుదర్శన ఆళ్వారును కొలుస్తూ సుదర్శన నారసింహ హోమం జరిపారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణం అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలు అర్పించారు. ఆలయంలో దర్శనం అనంతరం అష్టోత్తర పూజల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామివారికి జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.