పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవినటులుగా మాకు ప్రేక్షకుల కేరింతలు ఇచ్చే సంతోషం మరేదీ ఇవ్వదు, వాళ్ల ప్రోత్సాహమే మమ్మల్ని నడిపించే ఇంధనం అన్నారు స్టార్ హీరో చిరంజీవి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 1న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..మేము ఎంత కష్టపడి సినిమా చేసినా చివరకు కోరుకునేది డబ్బు కాదు ప్రేక్షకుల చప్పట్లు, ప్రోత్సాహమే. రేపు ఈ సినిమా సాధించబోయే విజయం ఇక్కడ మీ కేరింతల్లో కనిపిస్తున్నది. గోపీచంద్ విలక్షణమైన చిత్రాలు చేస్తుంటారు. ఆయన ఒక్కడున్నాడు, చాణక్య, సాహసం వంటి చిత్రాలను చూసి ఆస్వాదించాను.
తను ఇంకా పైకొచ్చే సామర్థ్యమున్న హీరో. ఈ సినిమా అతనికి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. వినోదం, సెంటిమెంట్, సందేశం కలిపి సినిమా చేస్తూ మారుతి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మారుతి దర్శకత్వంలో నటిస్తాను. ఈ సినిమా ట్రైలర్ బాగుంది, సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం కలుగుతోంది. అన్నారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ…పట్టుదలతో ఇండస్ట్రీలో ఎదిగారు చిరంజీవి. ఆయన మాలాంటి ఎందరికో స్ఫూర్తినిస్తారు. తనకున్న టాలెంట్ కు దర్శకుడు మారుతి ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటాడు. రాశీ ఖన్నా ఈ చిత్రంలో తన కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ చేసింది. మారుతి, బన్నీవాసు, యువీ వంశీ వీళ్ల చేతుల్లో సినిమా చేరితే సగం విజయం సాధించినట్లే. ఈ టీమ్ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది. అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ…గోపీచంద్ తో ఇన్నాళ్లకు ఓ మంచి మాస్ ఎంటర్ టైనర్ మూవీ నిర్మించడం సంతోషంగా ఉంది.
ఒకప్పుడు ఈవీవీ గారిలా మారుతి సినిమాలు రూపొందించి మెప్పిస్తున్నాడు. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు ఆయన. అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ…చిరంజీవి గారికి నేను పెద్ద అభిమానిని. నాలో దర్శకుడు ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన. పక్కా కమర్షియల్ సినిమా మీకు నచ్చేలా తెరకెక్కించాం. ఈ సినిమాతో నాకు గోపీచంద్ అనే మిత్రుడు దొరికాడు. నాకు నిత్యం అండగా నిలబడుతున్న అల్లు అరవింద్ గారికి థాంక్స్. అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ…నా మనసుకు చాలా దగ్గరైన చిత్రమిది. ఇప్పటిదాకా చేయని కొత్త తరహా పాత్రలో నటించాను. గోపీచంద్ ను కొత్తగా చూస్తారు. అని చెప్పింది. చిరంజీవి గారి నీడలో మేమంతా సంతోషంగా ఉన్నాం. ఈ సినిమా మాకు మా టీమ్ కు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, నటి శ్రియా, నటుడు రావు రమేష్, నిర్మాత ఎస్కేఎన్ తదితరులు పాల్గొన్నారు.