ముంబై: ఈ కాలం బౌలర్ల మైండ్సెట్పై మండిపడ్డాడు ఇండియన్ టీమ్ లెజెండరీ ఆల్రౌండర్, వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్. తాను ఆడిన సమయానికి, ఇప్పటికీ గేమ్ చాలా మారిపోయిన విషయాన్ని అంగీకరిస్తూనే.. నాలుగు ఓవర్లు వేసి అలసిపోతున్న బౌలర్లను చూసి కపిల్ బాధపడుతున్నాడు. హార్దిక్ పాండ్యా గాయపడిన తర్వాత ఇండియన్ టీమ్కు సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరక్కపోవడంపై స్పందిస్తూ కపిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ గాయం నుంచి కోలుకున్నా.. కూడా పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దీంతో అతన్ని డబ్ల్యూటీసీ ఫైనల్తోపాటు ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయలేదు.
దీనిపైనే కపిల్ స్పందించాడు. ఏడాదిలో పది నెలలు క్రికెట్ ఆడితే గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు క్రికెట్లో సింపుల్గా బ్యాట్తోనో, బాల్తోనే రాణిస్తే చాలన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కానీ మా సమయంలో అలా కాదు. అన్నీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు క్రికెట్ మారిపోయింది. కొన్నిసార్లు ఓ బౌలర్ నాలుగు ఓవర్లు వేసి అలసిపోవడం చూస్తే బాధ కలుగుతోంది అని కపిల్ అన్నాడు.
బౌలర్ల మైండ్సెట్ మారిపోయిందని కపిల్ అభిప్రాయపడ్డాడు. తాము ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చివర్లో వచ్చే బ్యాట్స్మన్కు కూడా కనీసం పది ఓవర్లు వేసేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ.. మా సమయంలో చివరి బ్యాట్స్మన్కు కూడా కనీసం పది ఓవర్లు బౌలింగ్ చేసేవాళ్లం. అదే మైండ్సెట్ ఇప్పటి ప్లేయర్స్ అలవాటు చేసుకోవాలి. అలా అయితే మీరు కండలు పెంచుకోగలరు అని కపిల్ సూచించాడు.