ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ బాగా నడుస్తుంది. హీరోలు కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో దర్శకులు కూడా కొత్త కథలతో అలరించే ప్రయత్నిస్తున్నారు. భీమ్లా నాయక్, మహా సముద్రం, ఆర్ఆర్ఆర్, బంగార్రాజు వంటి మల్టీ స్టారర్ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, త్వరలో చిరంజీవి- నాగార్జున కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ చిత్రం రూపొందనుందనే టాక్ నడుస్తుంది.
కోలీవుడ్ సూపర్ మూవీ ‘విక్రమ్ వేద’ సినిమాని తెలుగు లో రీమేక్ చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. విక్రమార్కుడు, బేతాళుడు కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలీవుడ్లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్లతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే బాలయ్య-రాజశేఖర్, నాగార్జున -వెంకటేష్, పవన్ కళ్యాణ్- రవితేజ ఇలా చాలామంది హీరోల కాంబినేషన్ తెరపైకి రాగా, ఇప్పుడు చిరు- నాగ్ పేర్లు వినిపిస్తున్నాయి.
విక్రమ్ వేద చిత్రం పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఇదే చిత్రాన్ని పుష్కర్ గాయత్రి తెలుగులో రీమేక్ చేయనున్నాడని అంటున్నారు. విజయ్ సేతుపతి క్యారెక్టర్లో చిరంజీవి.. మాధవన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నారంటూ టాక్ నడుస్తుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.