అగ్ర నటుడు చిరంజీవికి ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. గతంలో ఆయన చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో కనిపించి అభిమానుల్ని మెప్పించారు. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ మరోమారు ద్విపాత్రాభినయానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే…చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. కుటుంబ అనుబంధాలు, యాక్షన్ అంశాల కలబోతగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ఇందులో చిరంజీవి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని సమాచారం. కథానుగుణంగా రెండు పాత్రలకు సమప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా పూర్తయిన అనంతరం చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్లో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే బాబి దర్శకత్వం వహించనున్న సినిమా పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.